Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇక ప్రైవేట్ కంపెనీలతో విదేశాల్లో సైబర్ దాడులు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నేరగాళ్లపై దాడులు నిర్వహించేందుకు ఎంపిక చేసిన కొన్ని ప్రైవేట్ సంస్థలకు అనుమతి కల్పించే సంచలన విధానాన్ని ప్రకటించింది. ఈ సంస్థలు అమెరికా ప్రభుత్వ అనుమతి, పర్యవేక్షణతో విదేశాల్లోని సైబర్ నేరగాళ్లపై ఆఫెన్సివ్ సైబర్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. బ్లూమ్బర్గ్ తొలుత ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్ నేరాలు, అమెరికన్లను లక్ష్యంగా చేసుకునే ముప్పులను ఎదుర్కోవడంలో ప్రైవేట్ రంగంలోని వినూత్న సామర్థ్యాలను వినియోగించుకోవడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ర్యాన్సమ్వేర్ దాడులు, ఆర్థిక మోసాలు, సెక్స్టార్షన్ వంటి నేరాలను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టనున్నారు.
వివరాలు
నిఘా.. డేటా ధ్వంసం చేసే దాడులకు అనుమతి
కొత్త విధానం ప్రకారం ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వాములయ్యే ప్రైవేట్ సంస్థలు నిఘా చర్యలు చేపట్టడంతో పాటు అంతరాయం కలిగించే సైబర్ దాడులు నిర్వహించవచ్చు.
ఇందులో సమాచారాన్ని సేకరించేందుకు స్పైవేర్ వినియోగించడం, నేరగాళ్లకు చెందిన డేటా లేదా కంప్యూటర్ వ్యవస్థలను ధ్వంసం చేసే దాడులు చేపట్టడం వంటివి ఉంటాయి.
అయితే ఇలాంటి ఆపరేషన్లన్నీ అమెరికా ఫెడరల్ ప్రభుత్వ అనుమతి, పర్యవేక్షణలోనే నిర్వహించాల్సి ఉంటుంది.
వివరాలు
ప్రైవేట్ సంస్థలకు కఠిన నిబంధనలు..
ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రైవేట్ సంస్థలపై అమెరికా న్యాయశాఖ (Department of Justice), హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) పర్యవేక్షణ ఉంటుంది.
సాంకేతిక నైపుణ్యం, సైబర్ ఆపరేషన్లలో నిరూపితమైన అనుభవం, సంస్థ భద్రత వంటి పలు అంశాల్లో నిర్దేశించిన ప్రమాణాలను సంస్థలు తప్పనిసరిగా పాటించాలి.
అంతేకాదు.. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి సంస్థ కనీసం 10 లక్షల డాలర్ల బాండ్ లేదా ఎస్క్రో మొత్తాన్ని కలిగి ఉండాలి.
ఒప్పందంలోని నిబంధనలను సంస్థలు ఉల్లంఘిస్తే ఆ మొత్తాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
వివరాలు
చట్టపరమైన సమస్యలపై నిపుణుల ఆందోళన
ఈ విధానం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ప్రైవేట్ సంస్థలు అంతర్జాతీయ రాజకీయ, చట్టపరమైన వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొలంబియా యూనివర్సిటీకి చెందిన సీనియర్ సైబర్ కాన్ఫ్లిక్ట్ పరిశోధకుడు జేసన్ హీలీ.. ఇలాంటి ఆపరేషన్లలో పాల్గొనే వారు తీవ్రమైన వ్యక్తిగత చట్టపరమైన ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.
హంటర్ స్ట్రాటజీ సంస్థలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ జేక్ విలియమ్స్ కూడా ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశాలకు వెళ్లి ఇలాంటి ఆపరేషన్లలో పాల్గొనే అమెరికన్లను యూనిఫాం ధరించని యుద్ధ భాగస్వాములుగా పరిగణించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
అమాయకులకు నష్టం జరిగే ప్రమాదం..
ఈ సైబర్ ఆపరేషన్లలో ఎదురయ్యే మరో సమస్యపై హంట్రిస్ సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్స్ టీమ్ మేనేజర్ బెన్ బెర్న్స్టీన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సైబర్ నేరగాళ్లు తమ దాడులను మాస్కోలో ఉన్నట్లు గుర్తించగలిగే సర్వర్ల నుంచి నిర్వహించరని ఆయన తెలిపారు.
దీంతో ప్రతిదాడి చేసే సమయంలో అసలు నేరగాళ్లతో పాటు అమాయకులకు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
గతంలో అమెరికా ప్రభుత్వం సైబర్ ఆపరేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా.. స్వయంగా నిర్వహించేది.
ఇప్పుడు తొలిసారిగా ఎంపిక చేసిన ప్రైవేట్ సంస్థలకు కూడా ఇలాంటి చర్యల్లో భాగస్వామ్యం కల్పించే విధానాన్ని తీసుకొచ్చింది.