Grok AI: గ్రోక్ దుర్వినియోగంపై హెచ్చరిక.. చట్టవిరుద్ధ కంటెంట్కు కఠిన చర్యలు : ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లోని ఏఐ ప్లాట్ఫామ్ గ్రోక్ను ఉపయోగించి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ను సృష్టిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ స్పందించారు. గ్రోక్ను ఉపయోగించి చట్టవిరుద్ధ కంటెంట్ సృష్టించినట్లయితే కఠిన చర్యలు తప్పవని మస్క్ హెచ్చరించారు. అలాంటి కంటెంట్ను ఎక్స్లో అప్లోడ్ చేసే వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో, గ్రోక్ను దుర్వినియోగం చేసేవారికీ అదే స్థాయిలో చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. గ్రోక్ ద్వారా రూపొందుతున్న చట్టవిరుద్ధ కంటెంట్ను తక్షణమే తొలగించాలని భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ (MeitY) ఎక్స్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Details
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
అంతేకాదు 72 గంటల్లోగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. తమ ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన మరుసటి రోజే మస్క్ ఈ ప్రకటన చేయడం గమనార్హంగా మారింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో, ఎక్స్లోని ఓ పోస్టుకు స్పందించిన మస్క్ తమ తప్పేమీ లేదన్నట్లు వ్యాఖ్యానించారు. చాలా మంది గ్రోక్ అసభ్యకర కంటెంట్ను సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. నిజానికి ఒక పెన్తో ఎవరో తప్పుగా రాస్తే, అది పెన్ బాధ్యత కాదు... రాసిన వ్యక్తిదే. గ్రోక్ కూడా అంతే. మీరు ఇచ్చే ఇన్పుట్ను బట్టి అవుట్పుట్ రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు.