New York: న్యూయార్క్ పాఠశాలల్లో విద్యార్థులకు AIపై ఏడాది నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
పాఠశాలల్లో విద్యార్థులు కృత్రిమ మేధ(AI) వినియోగించడంపై న్యూయార్క్ నగర అధికారులు ఏడాది పాటు తాత్కాలిక నిషేధం విధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త సాంకేతికత వినియోగానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తరగతి గదుల్లో AI వినియోగంపై అమెరికాలో ఇప్పటివరకు తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఇదొకటిగా నిలిచింది. అమెరికాలోనే అతిపెద్ద పాఠశాల జిల్లాగా ఉన్న న్యూయార్క్ నగరంలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే లాస్ ఏంజెలిస్ సహా మరికొన్ని పాఠశాల జిల్లాలు కూడా AI వినియోగంపై తమ విధానాలను సమీక్షిస్తున్నాయి. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని పాఠశాలల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న సుమారు 40విద్యా సంబంధిత AI సాధనాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
6 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ప్రభావం
"పిల్లలు నేర్చుకోవడానికి, ఎదగడానికి ఉపాధ్యాయులు, మనుషులతో ప్రత్యక్ష సంబంధం అవసరం. ఇతర విద్యార్థులతో కలిసి నైపుణ్యాలను పెంచుకోవాలి. ఉపాధ్యాయులతో సంబంధాలు ఏర్పరచుకోవాలి. కఠినమైన సమస్యలను స్వయంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి" అని మామ్దానీ అన్నారు.
ఈ కొత్త విధానం ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న సుమారు 6 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ప్రభావం చూపనుంది.
అయితే హైస్కూల్ విద్యార్థులు కొన్ని సందర్భాల్లో AIని ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది.
ఉపాధ్యాయులు పాఠాల ప్రణాళిక తయారు చేసుకోవడం, షెడ్యూల్ రూపొందించడం వంటి పనులకు AIని ఉపయోగించుకోవచ్చని నగర అధికారులు వెల్లడించారు.
వివరాలు
గతంలోనూ AI వినియోగంపై ఆంక్షలు
ప్రధాన AI సంస్థలైన గూగుల్, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయంపై వెంటనే స్పందించలేదు.
న్యూయార్క్ నగర ప్రభుత్వ పాఠశాలలు గతంలోనూ AI వినియోగంపై ఆంక్షలు విధించాయి.
2022లో చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చిన కొద్దికాలానికే దాని వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించారు.
అనంతరం ఆ ఆంక్షలను ఎత్తివేసి, AI ఆధారిత ప్రత్యేక బోధనా సహాయక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.