T20 World Cup: నాకౌట్ రేసులో ఊహించని ట్విస్ట్.. గ్రోక్ ఎంపిక చేసిన నాలుగు జట్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో సూపర్ 8 దశ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ దశలో గ్రూప్-ఏలో భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు చోటు దక్కించుకోగా.. గ్రూప్-బీలో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. సూపర్ 8లో భాగంగా శనివారం (ఫిబ్రవరి 21) జరగాల్సిన పాకిస్థాన్-న్యూజిలాండ్ కీలక పోరు వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇక ఆదివారం (ఫిబ్రవరి 22) ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుండగా, మరో పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. సూపర్ 8 దశలోని రెండు గ్రూపుల్లో టాప్-2 స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్ బెర్తులు దక్కించుకుంటాయి.
Details
గ్రూప్-ఏ నుంచి భారత్, వెస్టిండీస్
దీంతో ఏ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయనే దానిపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. విశ్లేషకులు తమ తమ అంచనాలు చెబుతుండగా, ఈసారి కృత్రిమ మేధస్సు (AI) కూడా రంగంలోకి దిగింది. గ్రోక్ అనే ఏఐ చాట్బాట్ను సోషల్ మీడియా వేదిక Xలో ఓ యూజర్ సెమీస్కు చేరే జట్లపై ప్రశ్నించాడు. దీనికి స్పందించిన గ్రోక్ ఆశ్చర్యకరమైన అంచనాలు వెల్లడించింది. గ్రూప్-ఏ నుంచి భారత్, వెస్టిండీస్ జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయని పేర్కొన్న గ్రోక్.. గ్రూప్-బీ నుంచి పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయని అంచనా వేసింది. మొత్తంగా భారత్, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్లో నిలుస్తాయని తెలిపింది.
Details
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పేర్లు లేవు
అయితే ఈ జాబితాలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పేర్లు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ను సెమీస్కు అర్హత సాధించే జట్టుగా పేర్కొనడం క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసింది. పాకిస్తాన్ అవకాశాలపై గ్రోక్ తన విశ్లేషణ కూడా వెల్లడించింది. పాకిస్తాన్ పేస్ దళం బలంగా ఉందని, బ్యాటింగ్ ఆర్డర్ లోతు కూడా మెరుగ్గా ఉందని పేర్కొంది. ఇటీవల ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ సాధించిన టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ను కూడా ఉదాహరణగా చూపించింది. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.