Basant Kumar Meghwal: బసంత్ రికార్డు జంప్.. ప్రపంచ అండర్-20లో చారిత్రక రజతం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ భారత్కు చిరస్మరణీయంగా మారుతోంది. శనివారం ఆశిష్ యాదవ్ జావెలిన్ త్రోలో పదేళ్ల తర్వాత భారత్కు పతకం అందించగా.. ఆదివారం బసంత్ కుమార్ మేఘ్వాల్ మరో చారిత్రక ఘనత సాధించాడు. ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ టోర్నీ చరిత్రలోనే హైజంప్లో భారత్కు తొలి పతకాన్ని అందించాడు. భారత నౌకాదళంలో పనిచేస్తున్న 19 ఏళ్ల బసంత్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. హైజంప్ ఫైనల్లో బసంత్ 2.21 మీటర్ల ఎత్తును విజయవంతంగా అధిగమించి రెండో స్థానంలో నిలిచాడు. అల్జీరియాకు చెందిన యూన్స్ అయాచి, బ్రిటన్ అథ్లెట్ ఓటిస్ పూల్ కూడా 2.21 మీటర్లే దూకారు.
వివరాలు
2.24 మీటర్ల ఎత్తును దాటడంలో విఫలం
దీంతో అయాచి స్వర్ణం, పూల్ కాంస్యం సాధించారు. ఈ ముగ్గురూ 2.24 మీటర్ల ఎత్తును దాటడంలో విఫలమయ్యారు.
అయితే అంతకుముందు అత్యుత్తమ జంప్ను నమోదు చేసేందుకు వారు ఉపయోగించుకున్న ప్రయత్నాల ఆధారంగా తుది స్థానాలను నిర్ణయించారు.
దాంతో బసంత్ రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల హైజంప్లో గతంలో జాతీయ రికార్డు నెలకొల్పిన సహానా కుమారి.. బసంత్కు కోచింగ్ ఇవ్వడం విశేషం.
గతంలో బసంత్ అత్యుత్తమ ప్రదర్శన 2.11 మీటర్లు కాగా.. సహానా మార్గదర్శకత్వంలో అతడు ఏకంగా పది సెంటీమీటర్లు మెరుగుపడి 2.21 మీటర్లకు చేరుకున్నాడు.
వివరాలు
షానవాజ్కు లాంగ్జంప్లో కాంస్యం
లాంగ్జంప్లో భారత అథ్లెట్ షానవాజ్ ఖాన్ కాంస్య పతకంతో మెరిశాడు. తన మూడో ప్రయత్నంలో 7.84 మీటర్ల దూరం దూకి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
18 ఏళ్ల షానవాజ్ ప్రదర్శనపై కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించిన భారత లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్ ప్రశంసలు కురిపించాడు.
ప్రస్తుతం అండర్-20 జాతీయ రికార్డు, ఆసియా ఛాంపియన్షిప్ రికార్డు షానవాజ్ పేరిటే ఉన్నాయి.
ఈ ఫైనల్లో ఇటలీకి చెందిన డానియెల్ ఇంజోలి 7.97 మీటర్లతో స్వర్ణం సాధించగా.. ఆస్ట్రేలియాకు చెందిన మెక్గ్రాడర్ 7.96 మీటర్లతో రజతం గెలుచుకున్నాడు.
మరో భారత లాంగ్జంపర్ జితిన్ అర్జునన్ 7.59 మీటర్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
వివరాలు
ఫైనల్కు భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టు
మహిళల 4×400 మీటర్ల రిలేలోనూ భారత్ ఫైనల్కు అర్హత సాధించింది.
భూమిక నెహతె, తాహురా ఖాతున్, తను చౌదరి, థియ అరుముగమ్లతో కూడిన భారత బృందం హీట్లో 3 నిమిషాల 39.53 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది.
అయితే మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత్ ముందంజ వేయలేకపోయింది. రుజులా అమోల్, జి. భావన, ఆర్తి, అనన్య సురేష్ల బృందం 45.91 సెకన్లలో రేసును పూర్తి చేసి ఆరో స్థానంతో ముగించింది.
పురుషుల 4×400 మీటర్ల రిలేలో సయ్యద్ సబీర్, రంజిత్ కుమార్, పియూష్ రాజ్, మహ్మద్ అష్ఫాక్ల బృందం 3:08.56 నిమిషాల్లో రేసును పూర్తి చేసి ఐదో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వివరాలు
అతడి వెనుక ఇద్దరి కష్టం..
పురుషుల 5 వేల మీటర్ల రేస్ వాక్లో నితిన్ గుప్తా 19:32.30 నిమిషాల టైమింగ్తో ఆరో స్థానంలో నిలిచాడు.
ఎవరూ సాధించనిది సాధించడం.. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం గొప్ప ఘనత. బసంత్ కుమార్ మేఘ్వాల్ అదే చేసి చూపించాడు.
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ హైజంప్లో ఇంతకుముందు ఎంతోమంది భారత అథ్లెట్లు ప్రయత్నించినా.. ఒక్క పతకం కూడా సాధించలేకపోయారు.
అలాంటి వేదికపై బసంత్ నేరుగా రజత పతకాన్ని అందుకున్నాడు. నిజానికి అతడి ప్రదర్శన దాదాపుగా స్వర్ణం సాధించే స్థాయిలోనే ఉంది.
బంగారు పతకం గెలిచిన యూన్స్ అయాచి కూడా 2.21 మీటర్ల ఎత్తునే అధిగమించాడు.
అయితే అత్యుత్తమ జంప్ను సాధించేందుకు ఉపయోగించుకున్న అవకాశాల ఆధారంగా బసంత్ కాస్త వెనుకబడి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
వివరాలు
ప్రపంచ అండర్-20 వేదికపై రజతం సాధించి చరిత్ర
రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లా అనుప్గఢ్ గ్రామానికి చెందిన బసంత్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఇద్దరి కృషి ఉంది.
అందులో మొదటిది అతడి తండ్రి. డ్రైవర్గా, కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించిన ఆయన.. కుమారుడిని క్రీడల్లో ప్రోత్సహించారు.
మరోవైపు గతంలో జాతీయ రికార్డు నెలకొల్పిన మహిళా హైజంపర్ సహానా కుమారి.. బసంత్ను తీర్చిదిద్దారు. హైజంప్లో మెళకువలు నేర్పుతూ అతడిని మరింత రాటుదేలేలా చేశారు.
ఆమె మార్గదర్శకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో కర్ణాటకలోని తుమకూరులో జరిగిన జూనియర్ ఫెడరేషన్ కప్లో బసంత్ 2.21 మీటర్లతో కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.
ఇప్పుడు అదే 2.21 మీటర్ల ప్రదర్శనతో ప్రపంచ అండర్-20 వేదికపై రజతం సాధించి చరిత్ర సృష్టించాడు.
వివరాలు
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా..
ఈ విజయం అతడి తల్లిదండ్రులు, కోచ్లో ఆనందాన్ని నింపింది. ఈ విజయంతో వచ్చిన ప్రేరణతో భవిష్యత్తులో సీనియర్ స్థాయి పోటీల్లోనూ తనదైన ముద్ర వేయాలని బసంత్ ఉత్సాహంగా ఉన్నాడు.
లాంగ్జంప్లో కాంస్యం సాధించిన షానవాజ్ ఖాన్ ప్రయాణం కూడా స్ఫూర్తిదాయకమే.
ఉత్తర్ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా మాదైపుర్ గ్రామానికి చెందిన అతడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. షానవాజ్కు కేవలం పదేళ్ల వయసున్నప్పుడే అతడి తండ్రి నసీముద్దీన్ క్యాన్సర్తో కన్నుమూశారు.
అయినా ఆ విషాదంతో షానవాజ్ కుంగిపోలేదు.తండ్రి కష్టానికి విలువ చేకూర్చాలనే సంకల్పంతో కఠోరంగా సాధన చేశాడు.
అతడి బంధువు, ఆర్మీ జవాను, మాజీ జాతీయ జావెలిన్ త్రోయర్ మహ్మద్ హదీస్తో పాటు జాతీయ స్థాయి స్టీపుల్చేజర్ షారుఖ్ ఖాన్ అతడికి అండగా నిలిచారు.
వివరాలు
2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్నే తన ప్రధాన లక్ష్యం
వారి సహకారంతో షానవాజ్ శిక్షణ తీసుకుని తన ఆటను మెరుగుపరుచుకున్నాడు.
ప్రస్తుతం షానవాజ్ 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్నే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఆ ఒలింపిక్స్కు సంబంధించిన ఫొటోను తన ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోవడం అతడి లక్ష్యంపై ఉన్న పట్టుదలకు నిదర్శనం.
అయితే ప్రపంచ అండర్-20 పోటీల్లో తన ప్రదర్శనపై షానవాజ్ పూర్తిగా సంతృప్తి చెందలేదు.
''నా ప్రదర్శనతో సంతృప్తిగా లేను. తొలి రెండు ప్రయత్నాల్లో బాగానే దూకినప్పటికీ.. ఆ తర్వాత శరీరం సహకరించకపోవడంతో లయ దెబ్బతింది.
త్వరలోనే 8 మీటర్ల మార్క్ను దాటగలననే నమ్మకంతో ఉన్నా'' అని పోటీల అనంతరం షానవాజ్ పేర్కొన్నాడు.