Kidambi Srikanth: శ్రీకాంత్ శుభారంభం.. లక్ష్యసేన్ ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్పై 21-16, 21-15 తేడాతో విజయం సాధించాడు. దీంతో రెండో రౌండ్కు చేరుకున్న శ్రీకాంత్.. తదుపరి మ్యాచ్లో కెనడాకు చెందిన విక్టర్ లాయ్తో తలపడనున్నాడు. మరోవైపు భారత నంబర్వన్ పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్యసేన్కు మాత్రం తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. పేలవ ప్రదర్శన చేసిన అతడు 14-21, 7-21తో విక్టర్ లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
వివరాలు
పేలవ ఫామ్లో ఉన్న లక్ష్యసేన్..
తొలి గేమ్లో లక్ష్య 4-0తో ఆధిక్యంలోకి వెళ్లినా.. ఆ తర్వాత క్రమంగా వెనుకబడిపోయాడు.
లాయ్ గేమ్పై పట్టు సాధించి లక్ష్యకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
రెండో గేమ్లోనూ లాయ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సులభంగా విజయాన్ని అందుకున్నాడు.
విక్టర్ లాయ్ గత నెలలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు.
అతడి చేతిలో లక్ష్యసేన్ ఓడిపోవడం ఇది మూడోసారి. ఇప్పటివరకు లాయ్పై లక్ష్య ఒక్కసారి మాత్రమే విజయం సాధించాడు.
ప్రస్తుతం పేలవ ఫామ్లో ఉన్న లక్ష్య.. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ రెండో రౌండ్లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే.
వివరాలు
భారత యువ షట్లర్ తన్వి శర్మ బోణీ..
మహిళల సింగిల్స్లో భారత యువ షట్లర్ తన్వి శర్మ బోణీ కొట్టింది. తొలి రౌండ్లో డెన్మార్క్కు చెందిన అమైల్ షుల్జ్పై 21-16, 21-17తో విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకుంది.
తదుపరి రౌండ్లో జపాన్కు చెందిన తొమోకా మియాజకితో తన్వి శర్మ తలపడనుంది.
పురుషుల డబుల్స్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా రెండో రౌండ్కు దూసుకెళ్లింది.
తొలి రౌండ్లో జునైది ఆరిఫ్-కాంగ్ కై జింగ్ (మలేసియా) జోడీపై 21-11, 21-6తో ఘన విజయం సాధించింది.
మిక్స్డ్ డబుల్స్లోనూ భారత్కు శుభారంభం లభించింది. ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంట తొలి రౌండ్లో అలవోకగా విజయం సాధించింది.
తొనాకోర్న్ సేహెంగ్-తొనిచా సేహెంగ్ జోడీపై 21-8, 21-9తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది.