FIFA World Cup: వచ్చే ఫిఫా ప్రపంచకప్లో 64 జట్లు? భారత్కు అర్హత అవకాశాలపై కొత్త చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్-2026లో తొలిసారిగా 48 జట్లు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ మెగా టోర్నీ ప్రస్తుతం సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఇంకా రెండు సెమీఫైనల్ మ్యాచ్లు, మూడో స్థానం కోసం జరిగే పోరు, ఫైనల్తో టోర్నీ ముగియనుంది. ఇప్పటికే 48 జట్ల ఫార్మాట్కు మంచి స్పందన రావడంతో, భవిష్యత్ ప్రపంచకప్లో జట్ల సంఖ్యను 64కు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాన్నీ ఇన్ఫాంటినో వెల్లడించారు. ప్రపంచంలోని మరిన్ని దేశాలకు ప్రపంచకప్లో ఆడే అవకాశం కల్పించడమే ఈ ఆలోచన వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. దీంతో భారత్కు కూడా ప్రపంచకప్లో అర్హత సాధించే అవకాశం పెరుగుతుందా? అనే చర్చ ఫుట్బాల్ వర్గాల్లో మొదలైంది.
వివరాలు
ప్రతి దేశానికీ ప్రపంచకప్లో ఆడే అవకాశం ఉండాలి
ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఈ అంశంపై సంబంధిత కమిటీలు విస్తృతంగా చర్చించనున్నాయని గియాన్నీ ఇన్ఫాంటినో తెలిపారు.
ప్రపంచకప్ నిజమైన ప్రపంచ టోర్నీ కావాలంటే అన్ని ఖండాలకు, అన్ని దేశాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కేవలం యూరప్, దక్షిణ అమెరికా లేదా ఆఫ్రికా దేశాలకే పరిమితం కాకుండా, ప్రతి దేశం తమ జట్టును ప్రపంచకప్లో చూడాలనే కల నెరవేరేలా వేదిక కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పోటీపడుతున్న జట్ల నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉందని, భవిష్యత్తులో మరిన్ని దేశాలు కూడా అదే స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు.
చిన్న దేశాలకు అవకాశాలు ఇవ్వకపోతే ఆయా దేశాల్లో ఫుట్బాల్పై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వివరాలు
భారత్కు ఎలా ఉపయోగపడొచ్చు?
ప్రపంచకప్లో పాల్గొనే జట్ల సంఖ్యను 48 నుంచి 64కు పెంచితే మొత్తం 16 అదనపు జట్లకు అవకాశం లభిస్తుంది.
దీంతో వివిధ ఖండాలకు కేటాయించే ప్రత్యక్ష అర్హత (డైరెక్ట్ క్వాలిఫికేషన్) స్లాట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (AFC)కు ప్రస్తుతం ఉన్న కంటే ఎక్కువ డైరెక్ట్ స్లాట్లు లభించవచ్చు.
ప్రస్తుతం ఐదు ప్రధాన అర్హత స్థానాలు ఉండగా, అవి 12 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
దీంతో ఆసియా దేశాలకు ప్రపంచకప్లో చోటు దక్కే అవకాశాలు మరింత మెరుగుపడతాయి.
వివరాలు
భారత్కు ఎంత వరకు అవకాశం?
ఆసియా ఫుట్బాల్లో జపాన్,దక్షిణ కొరియా,ఇరాన్,ఆస్ట్రేలియా,సౌదీ అరేబియా వంటి బలమైన జట్లు ముందంజలో ఉన్నాయి.
వీటి తర్వాత ఖతార్,ఇరాక్,ఉజ్బెకిస్థాన్,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జోర్డాన్ వంటి జట్లు కూడా పోటీలో నిలుస్తాయి.
ప్రస్తుతం ఆసియా ర్యాంకింగ్స్లో భారత్ 15వ స్థానంలో ఉంది.
ఒకవేళ ఏఎఫ్సీకి అదనపు అర్హత స్లాట్లు లభిస్తే,చివరి ఒకటి లేదా రెండు స్థానాల కోసం భారత్కు కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది.
అయితే ఒమన్,బహ్రెయిన్,సిరియా,చైనా, వియత్నాం, థాయ్లాండ్ వంటి జట్లతో భారత జట్టు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జట్ల సంఖ్య పెరగడం ఒక్కటే అర్హతకు హామీ కాకపోయినా, భారత ఫుట్బాల్కు ప్రపంచకప్ కలను సాకారం చేసుకునే అవకాశాలను మాత్రం గణనీయంగా పెంచే అవకాశం ఉందని ఫుట్బాల్ విశ్లేషకులు భావిస్తున్నారు.