LOADING...
ICC: సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ సంచలన ప్రకటన.. భారత్, పాకిస్థాన్‌కు ప్రత్యేక షరతు!
సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ సంచలన ప్రకటన.. భారత్, పాకిస్థాన్‌కు ప్రత్యేక షరతు!

ICC: సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ సంచలన ప్రకటన.. భారత్, పాకిస్థాన్‌కు ప్రత్యేక షరతు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్ వేదికలపై తాజాగా ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ముందుగా కొన్ని వేదికలు ఫిక్స్‌ చేసినప్పటికీ, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు స్టేడియాలను కూడా ఖరారు చేసింది. కొత్తగా విడుదల చేసిన ప్లేయింగ్ కండిషన్స్‌ ప్రకారం శ్రీలంకకు హోమ్ సెమీఫైనల్ ఆడే అవకాశం లభించింది. సూపర్-8 దశ నుంచి శ్రీలంక చివరి నాలుగుకు అర్హత సాధిస్తే, వారు ఎవరిని ఎదుర్కొంటారన్నదానిపై సెమీఫైనల్ వేదిక నిర్ణయించారు. భారత్ లేదా పాకిస్థాన్‌ను కాకుండా మరో జట్టుతో శ్రీలంక సెమీస్ ఆడాల్సి వస్తే, ఆ మ్యాచ్ ఆర్. ప్రేమదాస్ స్టేడియం, కొలంబోలోనే నిర్వహించనున్నారు.

Details

పాకిస్థాన్, శ్రీలంక రెండూ సెమీస్‌కు రాకపోతే ఈడెన్ గార్డెన్స్ లోనే మ్యాచ్

ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా అన్ని స్టేక్‌హోల్డర్లకు పంపిన సమాచారంలో స్పష్టం చేసింది. పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకుంటే సెమీఫైనల్-1 కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్థాన్ క్వాలిఫై కాకపోయినా, శ్రీలంక అర్హత సాధించి భారత్‌ను తప్ప మరో జట్టుతో తలపడినా అదే వేదికలో మ్యాచ్ కొనసాగుతుంది. అయితే పాకిస్థాన్, శ్రీలంక రెండూ సెమీస్‌కు రాకపోతే, ఆ మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాకు మార్చుతారు. రెండో సెమీఫైనల్ మాత్రం వాంఖడే స్టేడియం, ముంబయిలోనే జరుగుతుంది. భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటే ప్రత్యర్థి ఎవరు అన్నది సంబంధం లేకుండా వాంఖడే వేదికగా మ్యాచ్ జరుగుతుంది.

Details

కొలంబోకు మార్చే అవకాశం

కానీ ఇండియా-పాకిస్థాన్ సెమీఫైనల్ జరిగితే మాత్రం ఆ పోరును కొలంబోకు మార్చుతారు. ఒకవేళ భారత్, పాకిస్థాన్, శ్రీలంక మూడు జట్లు కూడా సెమీస్‌కు చేరుకోలేకపోతే, సూపర్-8 గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో కోల్‌కతాలో తలపడుతుంది. గ్రూప్-2 విజేత గ్రూప్-1 రన్నరప్‌తో ముంబయిలో పోటీ పడుతుంది. ఈసారి సూపర్-8 గ్రూపుల కాంబినేషన్ కూడా ఆసక్తికరంగా ఉంది. గ్రూప్-1లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో పాకిస్థాన్, శ్రీలంకతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంక, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్లు సెమీఫైనల్‌లో ఒకదానితో ఒకటి తలపడే అవకాశం లేదు.

Advertisement