India vs WI: వెస్టిండీస్ సిరీస్కు భారత జట్ల ప్రకటన.. హార్దిక్, పంత్లకు మరోసారి నిరాశ
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్లకు భారత జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. చాలాకాలంగా వన్డే జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. వీరిద్దరినీ టీ20 జట్టులోనూ ఎంపిక చేయలేదు. హరియాణాకు చెందిన ఆల్రౌండర్ నమన్ ధీర్, జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబి తొలిసారిగా భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా,హైదరాబాద్కు చెందిన పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు.
వివరాలు
బుమ్రాకు విశ్రాంతి..
ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి వన్డే, టీ20 రెండు ఫార్మాట్లలోనూ అవకాశం లభించింది.
పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు వెస్టిండీస్తో జరిగే వన్డే, టీ20 సిరీస్ల నుంచి విశ్రాంతి కల్పించారు.
ప్రస్తుతం అఫ్గానిస్థాన్తో సిరీస్లో ఆడుతున్న బుమ్రా.. త్వరలో ఆసియా క్రీడల్లోనూ పాల్గొననున్నాడు.
శుభ్మన్ గిల్ నాయకత్వం వహించే భారత వన్డే జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. ఈ నిర్ణయం ముందుగా ఊహించినట్లుగానే ఉంది.
వివరాలు
టీ20 జట్టులో స్వల్ప మార్పులు..
ఆసియా క్రీడల్లో పాల్గొనే టీ20 జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లనే వెస్టిండీస్తో సిరీస్కు సెలక్టర్లు కొనసాగించారు.
అయితే యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ల స్థానంలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్లకు అవకాశం ఇచ్చారు.
వెస్టిండీస్తో భారత్ మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ ఈ నెల 27న ప్రారంభమవుతుంది.
అనంతరం ఇరు జట్ల మధ్య అయిదు టీ20ల సిరీస్ జరగనుంది.
వివరాలు
వన్డే,టీ20కి టీమిండియా స్క్వాడ్
భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీశ్కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబి, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.
టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబె, కుల్దీప్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్.