Ind Vs Eng: ఇంగ్లాండ్తో భారత్ తొలి వన్డే నేడు.. అందరిచూపు రో-కో పైనే
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచ ఛాంపియన్ హోదాతో యూకే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు తొలి రెండు సిరీస్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరిగిన టీ20 సిరీస్ల్లో భారత జట్టు పూర్తిగా నిరాశపరిచింది. వరుసగా ఆరు టీ20 మ్యాచ్ల్లో ఓటమి చవిచూడడంతో జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ స్థిరత్వం లేకపోవడం, కీలక ఆటగాళ్ల ఫామ్ లోపించడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడు భారత జట్టు దృష్టి పూర్తిగా వన్డే సిరీస్పై పడింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్తో తొలి వన్డే జరగనుంది. టీ20ల్లో ఎదురైన నిరాశను మరచి, వన్డేల్లో విజయంతో కొత్త ఆరంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది.
వివరాలు
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా విరాట్,రోహిత్
స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ శుభమన్ గిల్, అనుభవజ్ఞుడైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉండటంతో ఈ జట్టు మరింత సమతూకంగా కనిపిస్తోంది.
దీంతో ఈసారి ఫలితం భిన్నంగా ఉంటుందనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్లో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఈ సిరీస్ను ఎంతో కీలకంగా భావిస్తున్నారు.
ఇన్నింగ్స్ను రోహిత్తో కలిసి కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్లో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఆల్రౌండర్ స్థానానికి శివమ్ దూబె, అక్షర్ పటేల్లలో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది.
వివరాలు
భారత పేస్ దాడికి మరింత బలం బుమ్రా
బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో భారత పేస్ దాడికి మరింత బలం చేకూరనుంది.
అతనికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న బర్మింగ్హామ్ వేదిక సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.
వివరాలు
మ్యాచ్ సమయంలో స్వల్ప వర్షం
అయితే మ్యాచ్ సమయంలో స్వల్ప వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మరోవైపు హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కూడా బలంగానే ఉంది.
బెన్ డకెట్, జోస్ బట్లర్, జో రూట్, జాకబ్ బెతెల్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సకిబ్ మహ్మూద్ వంటి ఆటగాళ్లు ఆ జట్టుకు కీలక బలంగా నిలవనున్నారు.
దీంతో తొలి వన్డేలో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.