LOADING...
Sanath Jayasuriya : పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత కీలక నిర్ణయం.. కోచ్ పదవికి జయసూర్య గుడ్‌బై!
పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత కీలక నిర్ణయం.. కోచ్ పదవికి జయసూర్య గుడ్‌బై!

Sanath Jayasuriya : పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత కీలక నిర్ణయం.. కోచ్ పదవికి జయసూర్య గుడ్‌బై!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు ప్రస్థానం నిరాశాజనకంగా ముగిసింది. సొంత గడ్డపై టోర్నీ నిర్వహించినప్పటికీ కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేకపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఆఖరి సూపర్-8 పోరులో శ్రీలంక కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోవడం టోర్నీ నుంచి నిష్క్రమణకు దారితీసింది. ఈ ఓటమి వెంటనే లంక క్రికెట్‌లో పెద్ద ప్రకంపనలు రేపింది. జట్టు హెడ్ కోచ్, దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. టోర్నీ నుంచి బయటపడిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Details

ముందస్తు సమాచారం లేదు

జయసూర్య రాజీనామా విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డుకు ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. తన కాంట్రాక్ట్ జూన్ 2026 వరకు ఉన్నప్పటికీ దానిని కొనసాగించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. జట్టు బాధ్యతలను మరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నానని భావోద్వేగంగా తెలిపారు. వరల్డ్ కప్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నట్లు సమాచారం. అయితే మార్చి 13 నుంచి షార్జాలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు మాత్రం ఆయన జట్టుతో కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Details

కీలక మ్యాచుల్లో తడబడటంతో చేజారిన సెమీ ఫైనల్ అవకాశాలు

నిజానికి జయసూర్య కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంక జట్టు గణనీయ విజయాలు సాధించింది. 2024 టీ20 వరల్డ్ కప్ అనంతరం ఆయన పగ్గాలు చేపట్టగా, ఆగస్టులో టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలవడం విశేషం. అదేవిధంగా ఇంగ్లాండ్‌లో ఓవల్ టెస్టు విజయం, న్యూజిలాండ్‌పై క్లీన్ స్వీప్ వంటి ఫలితాలతో లంక క్రికెట్ పునరుజ్జీవనం పొందుతోందని అందరూ భావించారు. కానీ ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో స్వదేశీ పరిస్థితులను పూర్తిగా వినియోగించుకోవడంలో జట్టు విఫలమైంది. కీలక మ్యాచ్‌లలో తడబడటం సెమీఫైనల్ అవకాశాలను దెబ్బతీసింది.

Advertisement

Details

కొత్త కోచ్ కోసం అన్వేషణ

ఇప్పుడీ పరిణామాల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త కోచ్ కోసం అన్వేషణ ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకలు అస్తవ్యస్తమవడంతో ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మరోవైపు కోచ్ రాజీనామా బోర్డుకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. జయసూర్య వంటి దిగ్గజం తప్పుకోవడం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

Advertisement