MS Dhoni: ఝార్ఖండ్ టీ20 లీగ్ ప్రారంభోత్సవంలో మహేంద్ర సింగ్ ధోని సందడి..
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం ఎంతోకాలం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలో కనిపించారు. రాంచీలో జరిగిన తొలి ఝార్ఖండ్ టీ20 లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్కు ధోని టాస్ వేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ను గాయం కారణంగా పూర్తిగా మిస్ అయిన ధోని మళ్లీ మైదానంలో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2026లో ధోని లేకపోవడం క్రికెట్ అభిమానులకు పెద్ద నిరాశగా మారింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ఆయన మొత్తం సీజన్కు దూరమయ్యారు.
వివరాలు
ధోనీని చుట్టుముట్టిన ఫ్యాన్స్..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ధోని అనుభవం, నాయకత్వం లోటుగా మారింది. సీజన్ మొత్తం ఆయన సేవలు అందుబాటులో లేకపోవడంతో జట్టు చివరకు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఝార్ఖండ్ టీ20 లీగ్ ప్రారంభోత్సవంలో ధోని పాల్గొనడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది. కార్యక్రమంలో ధోని నల్ల రంగు పోలో టీ-షర్ట్, సన్గ్లాసెస్తో కనిపించారు. అధికారులు, ఆటగాళ్లతో ఆయన సరదాగా మాట్లాడిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్టాండ్స్లో కూర్చున్న ధోనిని చూసిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.
వివరాలు
ధోనీ రావడంతో టోర్నీకి గుర్తింపు..
తన సొంత రాష్ట్రంలో ధోనికి ఇప్పటికీ ఉన్న అపారమైన అభిమానాన్ని ఈ స్పందన మరోసారి చాటిచెప్పింది. అంతేకాకుండా, ఆయన హాజరుకావడం వల్ల ఈ కొత్త టోర్నీకి మరింత గుర్తింపు లభించినట్లు భావిస్తున్నారు. తొలి ఝార్ఖండ్ టీ20 లీగ్లో మొత్తం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. రాంచీ టైటాన్స్, జంషెడ్పూర్ స్టీలర్స్, చోటా నాగ్పూర్ రాయల్స్, కోయలాంచల్ సూపర్ కింగ్స్, ధన్బాద్ డైమండ్స్, సంతాల్ స్ట్రైకర్స్ జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగాయి. వచ్చే రెండు వారాల్లో సెమీఫైనల్స్, ఫైనల్తో కలిపి మొత్తం 27 మ్యాచ్లు నిర్వహించనున్నారు. అన్ని మ్యాచ్లు జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో జరగనున్నాయి.