LOADING...
T20 World Cup : గెలిచినా పాక్‌కు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్
గెలిచినా పాక్‌కు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

T20 World Cup : గెలిచినా పాక్‌కు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ లో శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. అయితే సూపర్‌-8 దశ నుంచి ముందుకు సాగాలంటే శ్రీలంకను 147 పరుగులకే పరిమితం చేయాల్సిన అవసరం పాక్‌కు ఉంది. అది సాధ్యంకాకపోవడంతో న్యూజిలాండ్ సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఫలితంగా పాకిస్తాన్ సూపర్‌-8 దశలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను పాకిస్తాన్ బౌలర్లు 12వ ఓవరుకే 101 పరుగులకే ఐదు వికెట్లు తీసి కట్టడి చేశారు. ఆ దశలో మ్యాచ్‌ పూర్తిగా పాక్ వైపే మొగ్గుచూపినట్లు కనిపించింది. కానీ పవన్ రత్నాయకే 37 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు.

Details

రాణించిన కెప్టెన్ షనకా

కెప్టెన్ షనకా 31 బంతుల్లో అజేయంగా 76 పరుగులు సాధించి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాడు. చివరి ఓవర్‌లో షహీన్ షా ఆఫ్రిది బౌలింగ్‌లో షనకా 4-6-6-6తో సంచలనం సృష్టించాడు. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన సమయంలో ఐదో బంతిని స్కూప్‌ చేయాలని ప్రయత్నించి మిస్ అయ్యాడు. చివరి బంతిని వైడ్‌గా భావించి వదిలేశాడు. అయితే అది యార్కర్‌గా రావడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 148 పరుగులకే ముగిసింది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఫర్హాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. 60 బంతుల్లో శతకం సాధించి ఒకే టోర్నీలో విరాట్ కోహ్లి 2014లో చేసిన 319 పరుగుల రికార్డును అధిగమించాడు.

Details

నా శతకం జట్టుకు ఉపయోగపడలేదు

40 పరుగులు దాటగానే ఆ మార్క్‌ను చేరుకున్న ఫర్హాన్ మొత్తం రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో 383 పరుగులు సాధించాడు. "నా శతకం జట్టుకు ఉపయోగపడలేదు. అందుకే బాధగా ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాను. ఏ బంతినైనా బౌండరీకి తరలించగలనని నమ్మకం ఉందని ఫర్హాన్ వ్యాఖ్యానించాడు. జమాన్ 42 బంతుల్లో 84 పరుగులు చేసి 16వ ఓవర్లో ఔటయ్యాడు. 11వ ఓవర్లో 46 పరుగుల వద్ద అతనికి ఎడ్జ్ వచ్చినప్పటికీ శ్రీలంక టీవీ రిఫరల్ కోరలేదు. ఆ సమయంలో స్కోరు 107-0గా ఉంది. అయితే చివరి 26 బంతుల్లో ఎనిమిది వికెట్లు తీసి కేవలం 36 పరుగులే ఇచ్చి శ్రీలంక బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు.

Advertisement

Details

సెమీఫైనల్స్‌కు వెళ్లిన మూడు జట్లు ఇవే

దిల్షాన్ మదుశంక 3-33, షనకా 2-42తో మెరుగైన గణాంకాలు నమోదు చేశారు. శ్రీలంక టాప్ ఆర్డర్‌ను అబ్రార్ అహ్మద్ మూడు వికెట్లు తీసి దెబ్బతీశాడు. కానీ డ్యూ కారణంగా బంతి తడవడంతో బౌలర్లకు లెంగ్త్ కుదరలేదు. ఉస్మాన్ తారిఖ్ భారీగా పరుగులు ఇచ్చి తన స్పెల్ ముగించాడు. వరుసగా 26 ఇన్నింగ్స్‌లలో వికెట్ తీసిన రికార్డును దాటే అవకాశాన్ని కోల్పోయాడు. సెమీఫైనల్స్‌కు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఇప్పటికే అర్హత సాధించినట్లు స్పష్టమైంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ నేడు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. వచ్చే వారం భారత్‌లోనే రెండు సెమీఫైనల్స్‌తో పాటు మార్చి 8న ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

Advertisement