Serena Williams: నాలుగేళ్ల తర్వాత టెన్నిస్ కోర్టులోకి.. 90 నిమిషాల్లోనే ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ప్రొఫెషనల్ టెన్నిస్లో అడుగుపెట్టిన అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తన పునరాగమన మ్యాచ్లో విజయంతో ఆకట్టుకుంది. క్వీన్స్ క్లబ్ ఛాంపియన్షిప్-2026 టోర్నీలో కెనడాకు చెందిన విక్టోరియా మ్బోకోతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన సెరెనా, తొలి రౌండ్లోనే శుభారంభం చేసింది. ఈ జంట మూడో సీడ్గా ఉన్న న్యూజిలాండ్ క్రీడాకారిణి ఎరిన్ రౌట్లిఫ్, అమెరికాకు చెందిన నికోల్ మెలిచార్-మార్టినెజ్ జోడీపై వరుస సెట్లలో 7-6 (7-2), 6-2 స్కోరుతో విజయం సాధించింది. కేవలం 90 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సెరెనా-విక్టోరియా జోడీ పూర్తి ఆధిపత్యం చాటింది.
వివరాలు
25 ఏళ్ల వయసు తేడా.. అయినా ఆటలో అద్భుతం..
44 ఏళ్ల సెరెనా విలియమ్స్, 19 ఏళ్ల విక్టోరియా మ్బోకో మధ్య 25 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, కోర్టులో మాత్రం ఇద్దరూ అద్భుతమైన అవగాహనతో ఆడారు. వారి సమన్వయానికి ప్రత్యర్థి జోడీ సమాధానం చెప్పలేకపోయింది. 2022 యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్కు దూరంగా ఉంటానని సెరెనా ప్రకటించింది. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ ప్రొఫెషనల్ టెన్నిస్లోకి రావాలని నిర్ణయించుకుంది.
వివరాలు
కెరీర్లో మొత్తం 39 గ్రాండ్స్లామ్ టైటిళ్లు కైవసం..
ఈ మ్యాచ్ ఆమెకు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆడిన తొలి ప్రొఫెషనల్ పోటీ. వైల్డ్కార్డ్ అవకాశం ద్వారా ఆమె ఈ టోర్నీలో ప్రవేశించింది. సెరెనా విలియమ్స్ తన కెరీర్లో మొత్తం 39 గ్రాండ్స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకుంది. వాటిలో 23 మహిళల సింగిల్స్, 14 మహిళల డబుల్స్, రెండు మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. ఆమె తిరిగి కోర్టులోకి రావడం టెన్నిస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.