LOADING...
Team India: సూపర్‌-8లో భారత్‌ భవితవ్యాన్ని నిర్ణయించేది ఆ ముగ్గురే : బంగర్
సూపర్‌-8లో భారత్‌ భవితవ్యాన్ని నిర్ణయించేది ఆ ముగ్గురే : బంగర్

Team India: సూపర్‌-8లో భారత్‌ భవితవ్యాన్ని నిర్ణయించేది ఆ ముగ్గురే : బంగర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ వరుసగా నాలుగు విజయాలతో సూపర్‌-8 దశలోకి దూసుకెళ్లింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మినహా టాప్‌ ఆర్డర్‌ బలంగా నిలబడుతోంది. బౌలింగ్‌ విభాగంలోనూ ప్రతి ఆటగాడు తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. అయితే అసలు పరీక్ష ఇప్పుడు మొదలుకానుంది. సూపర్‌-8లో భారత్‌ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లాంటి పటిష్ట జట్లతో పాటు సంచలన ప్రదర్శన చేస్తున్న జింబాబ్వేతో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ కోచ్‌ సంజయ్ బంగర్ రాబోయే మ్యాచ్‌లపై తన విశ్లేషణను వెల్లడించాడు. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం అవసరం లేదు. వారిని సమష్టిగా ఉన్న జట్టుగా చూడాలి.

Details

ఒకరిద్దరు మినహా మిగతా ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నారు

ప్రస్తుత జట్టులో ఒకరిద్దరు మినహా మిగతా ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇంకా మన ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రావాల్సి ఉంది. అయినప్పటికీ వరుస విజయాలు సాధించాం. గత నాలుగు మ్యాచ్‌ల్లో ప్రతి ఒక్కరికీ ఆడే అవకాశం లభించడం సానుకూల అంశం. దీంతో మెగా టోర్నీలో ఆడిన అనుభవం అందరికీ వచ్చింది. అయితే ఫీల్డింగ్‌లో మెరుగుదల అవసరం ఉంది. పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ల్లో కొన్ని క్యాచ్‌లు వదిలేశామని బంగర్‌ వ్యాఖ్యానించాడు. సూపర్‌-8లో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడనుందని పేర్కొన్న బంగర్‌, ముగ్గురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు.

Details

అతడే భారత నంబర్‌ వన్

ఓపెనర్‌ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతున్నాడు. అభిషేక్‌ శర్మ బ్యాటింగ్‌ వైఫల్యాన్ని బాగా కవర్‌ చేస్తున్నాడు. నా దృష్టిలో ఇషానే భారత నంబర్‌ వన్‌ బ్యాటర్‌. కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్ కూడా నిలకడగా పరుగులు రాబడుతున్నాడు. ఇదే ఫామ్‌ కొనసాగితే జట్టుకు మరింత బలం చేకూరుతుంది. మూడో కీలక ఆటగాడిగా జస్పిత్ బుమ్రా నిలుస్తాడు. స్పిన్‌ గురించి చర్చ ఎక్కువగా జరుగుతున్నా, సూపర్‌-8లో బుమ్రా తన పేస్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తాడని బంగర్‌ తన విశ్లేషణలో పేర్కొన్నాడు. మొత్తానికి, సూపర్‌-8 దశలో టీమిండియా విజయ రథాన్ని కొనసాగించాలంటే ఫీల్డింగ్‌లో కచ్చితత్వం పెంచుతూ, కీలక ఆటగాళ్లు తమ ఫామ్‌ను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించాడు.

Advertisement