T20 WC 2026: భారత్-వెస్టిండీస్ రద్దైతే ఏం జరుగుతుంది.. సెమీస్ అవకాశాలు ఎవరికంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్-2026లో గ్రూప్-1 సూపర్-8 పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఇక రెండో స్థానానికి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఫిబ్రవరి 26న జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలవ్వడం, భారత్ జింబాబ్వేపై ఘన విజయం సాధించడం వల్ల గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ స్థానంపై స్పష్టత వచ్చింది. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ రెండూ చెరో రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. రన్రేట్ పరంగా చూస్తే వెస్టిండీస్ (1.791) భారత్ (-0.100) కంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉంది.
Details
మార్చి 1న మ్యాచ్
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రన్రేట్ కీలకం కాదు. మార్చి 1న కోల్కతాలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితమే సెమీస్ బెర్త్ను నిర్ణయించనుంది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారే సెమీఫైనల్కు అర్హత సాధిస్తారు. ఏదైనా కారణంగా మ్యాచ్ రద్దైతే మాత్రం రన్రేట్ కీలకమవుతుంది. అలాంటి పరిస్థితిలో ఇరు జట్లకు చెరో 3 పాయింట్లు వస్తాయి. అప్పట్లో మెరుగైన రన్రేట్ ఉన్న వెస్టిండీస్కే సెమీస్ అవకాశాలు దక్కుతాయి. అయితే భారత అభిమానులకు ఊరట కలిగించే విషయం ఏమిటంటే, ప్రస్తుతం మ్యాచ్కు వర్షం ముప్పు కనిపించడం లేదు. యాక్యూవెదర్ అంచనాల ప్రకారం మార్చి 1న, ముఖ్యంగా రాత్రి 7 నుంచి 12 గంటల మధ్య ఎలాంటి వర్ష సూచనలు లేవు.
Details
విండీస్ పై భారత్ గెలవాలి
ఉష్ణోగ్రత సుమారు 23 డిగ్రీల వరకు ఉండే అవకాశముంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మ్యాచ్ సజావుగా సాగితే విజయం తమదేననే నమ్మకంతో ఉన్నారు. టోర్నీ ప్రారంభం నుంచి అజేయంగా దూసుకెళ్లిన వెస్టిండీస్ నిన్న దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి అనంతరం జింబాబ్వేపై ఘన విజయంతో భారత్ మళ్లీ జోష్లోకి వచ్చింది. ఈ ఉత్సాహాన్ని వెస్టిండీస్పై కూడా కొనసాగిస్తే భారత్కు సెమీస్ బెర్త్ ఖాయం. సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థిగా ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్ జట్లలో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది.