Page Loader
Kazakhstan: కజకిస్థాన్ విమాన ప్రమాదంలో 42 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరో 25 మంది
కజకిస్థాన్ విమాన ప్రమాదంలో 42 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరో 25 మంది

Kazakhstan: కజకిస్థాన్ విమాన ప్రమాదంలో 42 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరో 25 మంది

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కజకిస్థాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 42 మంది మృతిచెందినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగతా ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని పేర్కొంది. ప్రమాద సమయంలో విమానం రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం కూలిపోగానే భారీ మంటలు ఎగిసిపడి రెండు భాగాలుగా విరిగిపోయింది. ఒక భాగం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు, మరొక భాగంలో మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలు అదుపులోకి తెచ్చారు.

Details

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది

కజకిస్థాన్‌లోని అక్తావు నగరంలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 25 మంది ప్రాణాలతో బయటపడ్డారని స్థానిక వార్తా సంస్థ బుధవారం మధ్యాహ్నం తెలిపింది. 11 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల యువకుడు సహా 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 42 మంది మృతిచెందారు. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ జెట్‌కు చెందిన విమానంలో 62 ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి ప్రయాణం చేస్తూ, భారీ పొగమంచు కారణంగా అక్తావు వైపు తిరిగింది. ఇక పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా, ఊహించని ప్రమాదం జరిగింది.

Details

పక్షుల గుంపు ఢీకొట్టడంతో ప్రమాదం

ప్రాథమిక నివేదికల ప్రకారం, విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టింది. దీని వల్ల స్టీరింగ్ పని చేయకపోవడం లేదా ఒక ఇంజిన్ దెబ్బతినడం జరిగిందని తెలుస్తోంది. పైలట్లు వేగం, ఎత్తును నియంత్రించడానికి ప్రయత్నించినా, వాటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం అక్తావు విమానాశ్రయానికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పుడు కూలిపోయింది. ప్రమాదం తర్వాత కొంతమంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ చాలా మంది షాక్‌లో ఉన్నారు. వారు ఏమి జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. విమానంలోని ఒక భాగం నుంచి బయటపడ్డ ప్రయాణికులు భయాందోళనతో గజిబిజి అవుతూ కనిపించారు.