Bangladesh: బంగ్లాదేశ్లో మానవత్వానికి మచ్చ.. హిందూ వితంతుపై సామూహిక అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
పొరుగుదేశం బంగ్లాదేశ్లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలిగంజ్లో చోటుచేసుకుంది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరిస్తూ అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రెండున్నరేళ్ల క్రితం బాధిత మహిళ షహిన్, అతడి తమ్ముడి వద్ద కొంత భూమితో పాటు ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి షహిన్ ఆమెను అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది.
Details
చెట్టుకు కట్టేసి జుట్టును కత్తిరించారు
శనివారం సాయంత్రం బాధిత మహిళ ఇంటికి ఆమె బంధువులు వచ్చిన సమయంలో షహిన్ తన అనుచరుడు హసన్తో కలిసి ఇంట్లోకి చొరబడ్డాడు. ముందుగా బంధువులను తరిమికొట్టి, అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేయగా, ఆమె నిరాకరించడంతో చెట్టుకు కట్టేసి జుట్టును కత్తిరించారు. ఈ మొత్తం ఘటనను వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయిన ఆమెను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం కలిగంజ్ పోలీస్ స్టేషన్లో షహిన్, హసన్పై ఫిర్యాదు నమోదు చేశారు.
Details
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ఇలాంటి నేరాలు వరుసగా జరుగుతుండటం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ముఖ్యంగా మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నా, యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.