రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి; ఉగ్రవాదుల పనేనా?
పాకిస్థాన్లోని క్వెట్టా వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులో గురువారం పేలుడు సంభవించడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు వెల్లడించారు. రైలు చిచావత్ని రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు. రైలులోని నాలుగో నంబర్ బోగీలో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికార ప్రతినిధి చెప్పినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. పేలుడు అనంతరం రైలులోని ప్రయాణికులను అధికారులు దించేశారు.
ఆధారాలు సేకరిస్తున్న ఉగ్రవాద నిరోధక శాఖ
జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులో సిలిండర్ పేలిన ఘటనకు సంబంధించి ఆధారాలను ఉగ్రవాద నిరోధక శాఖ అధికారులు సేకరిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. పెషావర్లో మసీదులో ప్రార్థన సమయంలో పేలుడు జరిగి 100 మందికి పైగా మరణించిన కొద్ది రోజుల తరువాత ఈ సంఘటనపై నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పాక్లో రైలులో సిలిండర్ను తీసుకెళ్లడం నిషేధం. ఈ క్రమంలో రైలులో దాన్ని ఎవరు తీసుకొచ్చారు? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.