Elon Musk: ప్రకటన ఆదాయాన్ని విరాళంగా ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎవరికంటే?
ఎలాన్ మస్క్ సోషల్ మీడియా సంస్థ X Corp గాజాలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు,చందాల నుండి వచ్చే మొత్తం ఆదాయాన్ని ఇజ్రాయెల్,హమాస్-నియంత్రిత ప్రాంతంలోని ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్లు టెక్ బిలియనీర్ మంగళవారం ప్రకటించారు. "X Corp గాజాలో యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు,సబ్స్క్రిప్షన్ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఇజ్రాయెల్లోని ఆసుపత్రులకు, గాజాలోని రెడ్క్రాస్/క్రెసెంట్కు విరాళంగా అందజేస్తుందని మస్క్ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. విరాళం ఇచ్చిన మొత్తం హమాస్ మిలిటెంట్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందని ఒక వినియోగదారు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు, బాధితులకు సహాయం చేయడానికి మెరుగైన ఆలోచనల కోసం మస్క్ పిలుపునిస్తూ, నిధులను ఎలా ఖర్చు చేస్తారో కంపెనీ ట్రాక్ చేస్తుందని చెప్పారు.
తాత్కాలిక కాల్పుల విరమణ ముందు మస్క్ ప్రకటన
పాలస్తీనా రెడ్ క్రెసెంట్ భవనాన్ని తమ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటున్నారని పేర్కొంటూ మరో సోషల్ మీడియా యూజర్ హమాస్ మిలిటెంట్ వీడియోను పోస్ట్ చేశారు. సోషల్ మీడియా యూజర్ కి మస్క్ సమాధానమిస్తూ గాజాలో పిల్లలకు సహాయం చేయడానికి మంచి మార్గం ఏమిటి? పీడియాట్రిక్ మెడికల్ సామాగ్రిని నేరుగా కొనుగోలు చేయవచ్చా? అంటూ అడిగారు. గాజా స్ట్రిప్లో బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ బందీలను విడిపించే సంధి ఒప్పందంలో హమాస్ మిలిటెంట్ గ్రూపుతో తాత్కాలిక కాల్పుల విరమణను ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదించడానికి కొన్ని గంటల ముందు ఈ ప్రకటన వచ్చింది.
హమాస్ విడుదల చేసే బందీలలో మహిళలు, పిల్లలు
ఈ ఒప్పందం ప్రకారం నాలుగు రోజుల కాల్పులకు విరామం ప్రకటిస్తారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ గాజాలో తన సైనిక దాడిని నిలిపివేస్తుంది. అయితే హమాస్ దాదాపు 240 మంది బందీలలో 50 మందిని విడుదల చేస్తుందని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. హమాస్ విడుదల చేసే బందీలలో మొట్టమొదటగా మహిళలు, పిల్లలు ఉంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది.