Iran: హర్ముజ్లో ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడి.. ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
హర్ముజ్ జలసంధిలో గురువారం ఓ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అక్కడ చిక్కుకుపోయిన నౌకలు,నావికులను తరలించే ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత వారం అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై అంగీకారం కుదిరినప్పటికీ,హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణ కొనసాగుతోందని ఇరాన్ మరోసారి సంకేతాలు ఇచ్చినట్లు ఈ ఘటనతో స్పష్టమైంది. అమెరికా అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం,ఈ నౌకపై ఇరాన్ డ్రోన్తో దాడి జరిపినట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా బాధ్యత స్వీకరించలేదు. ఈ దాడికి కొన్ని గంటల ముందే ఇరాన్కు చెందిన శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్, తమ దేశం సూచించిన మార్గాల ద్వారానే నౌకలకు సురక్షిత ప్రయాణం ఉంటుందని హెచ్చరించింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన ముడి చమురు ధరలు
దీంతో హర్ముజ్ జలసంధి మళ్లీ పూర్తిగా స్వేచ్ఛగా తెరుచుకుందని అమెరికా చేసిన ప్రకటనకు ఇరాన్ సవాల్ విసిరినట్టైంది. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమైన తర్వాత నమోదైన తొలి దాడి ఇదే కావడం గమనార్హం. ఈ ఘటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో గల్ఫ్ దేశాలకు ఈ ఒప్పందంపై నమ్మకం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించిన వివరాల ప్రకారం, గుర్తుతెలియని క్షిపణి నౌక కుడి వైపు భాగాన్ని తాకడంతో బ్రిడ్జ్కు నష్టం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగలేదని అధికారులు తెలిపారు.
వివరాలు
నావికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం
ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ దాడి కారణంగా ఐరాసకు చెందిన అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) తన తరలింపు కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన 100కు పైగా నౌకలు, 11 వేల మందికి పైగా నావికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. నావికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిస్థితులు స్పష్టమయ్యే వరకు తరలింపు కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని IMO ప్రధాన కార్యదర్శి అర్సెనియో డొమింగ్వెజ్ తెలిపారు.
వివరాలు
బుధవారం ఒక్కరోజే 70నౌకలు
దాడికి గురైన నౌక తమ తరలింపు ప్రణాళికలో భాగం కాదని,అయినప్పటికీ ఇలాంటి ఘటనలు నావికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ వారం హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు అత్యధిక స్థాయికి చేరాయి. మెరైన్ ట్రాఫిక్ డేటా ప్రకారం బుధవారం ఒక్కరోజే 70నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాయి. వీటిలో ఎక్కువ నౌకలు ఒమాన్ తీరాన్ని ఆనుకుని వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నాయి. హర్ముజ్ జలసంధిపై నియంత్రణను చర్చల్లో కీలక ఆయుధంగా ఇరాన్ భావిస్తోంది. గురువారం రివల్యూషనరీ గార్డ్స్ మరోసారి హెచ్చరికలు జారీ చేస్తూ,ఇరాన్ అనుమతించిన మార్గాల ద్వారానే సురక్షిత ప్రయాణం ఉంటుందని ప్రకటించింది.
వివరాలు
అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తే..
దాడి అనంతరం ఇటీవల ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ కూడా ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తే దాని పరిణామాలకు నౌక యజమానులు, నిర్వాహకులు, కెప్టెన్లే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిని 60 రోజుల పాటు టోల్ లేకుండా తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ఇప్పటికే అమెరికా ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసింది. అయితే ఈ ఒప్పందంలో వాణిజ్య నౌకల రాకపోకల పర్యవేక్షణలో ఒమాన్తో పాటు ఇరాన్కు కూడా అధికారిక పాత్ర కల్పించారు.
వివరాలు
హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ రుసుములు
యుద్ధం సమయంలో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ రుసుములు వసూలు చేయడం ప్రారంభించింది. దీనిని దీర్ఘకాలిక శాంతి ఒప్పందంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అమెరికా స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల వినియోగానికి ఏ దేశం కూడా టోల్ వసూలు చేసే హక్కు లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో బహ్రెయిన్లో జరిగిన గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పేర్కొన్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కూడా హర్ముజ్ జలసంధిపై టోల్లు, రుసుములు లేదా నియంత్రణ ప్రయత్నాలను గల్ఫ్ దేశాలు తిరస్కరించాయి.
వివరాలు
భవిష్యత్తులో నౌకలపై ఎలాంటి రవాణా రుసుములు ఉండబోవు: ఒమాన్
అయితే ఈ జలమార్గం అంతర్జాతీయ జలాల పరిధిలోకి రాదని వాదిస్తున్న ఇరాన్, భవిష్యత్తులో ఒమాన్తో కలిసి టోల్ కాకుండా సేవా రుసుము విధించే అవకాశాన్ని గతంలో ప్రస్తావించింది. అయితే భవిష్యత్తులో నౌకలపై ఎలాంటి రవాణా రుసుములు ఉండబోవని ఒమాన్ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. గత వారం అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు యుద్ధం ప్రారంభమైన తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయి. అయితే గురువారం జరిగిన దాడి తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 2 శాతం పెరిగి 74 డాలర్లకు చేరి, అనంతరం మళ్లీ కొంత తగ్గింది.
వివరాలు
రానున్న 60 రోజుల్లో ఉన్నతస్థాయి చర్చలు
ఈ ఒప్పందం ద్వారా యుద్ధానికి ముగింపు పలకడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తామని ఇరాన్ హామీ ఇవ్వడం వంటి అంశాలపై అంగీకారం కుదిరింది. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, సుసంపన్న యురేనియం నిల్వలు వంటి కీలక అంశాలపై రానున్న 60 రోజుల్లో ఉన్నతస్థాయి చర్చలు జరగనున్నాయి. జూన్ 30 నుంచి అణుశక్తి, ఆంక్షలు తదితర అంశాలపై నిపుణుల బృందాలు చర్చలు ప్రారంభించనున్నట్లు మార్కో రుబియో వెల్లడించారు.
వివరాలు
నబాతియె సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అమెరికా-ఇరాన్ చర్చలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ రెండు అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని ఇరాన్ చెబుతుండగా, అమెరికా మాత్రం వాటిని వేర్వేరుగా చూస్తోంది. శుక్రవారం ఉదయం లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని నబాతియె సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇదే సమయంలో లెబనాన్లో ఇజ్రాయెల్ చర్యలపై ట్రంప్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇజ్రాయెల్ పర్యటనను ఈసారి దాటవేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.