జపాన్: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జపాన్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హిరోషిమాలో ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడుతూ.. నేటికీ హిరోషిమా అనే పదం వింటేనే ప్రపంచం భయపడుతోందని అన్నారు. జీ7 సదస్సు కోసం జపాన్లో పర్యటించిన సందర్భంగా మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు లభించిందన్నారు. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటారని తెలుసుకున్నాక తాను చాలా సంతోషించినట్లు చెప్పారు.
మహాత్ముడికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ
జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ; ద్వైపాక్షిక అంశాలపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో జపాన్ పీఎంతో ఫ్యూమియో కిషిదాతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సంస్కృతితో సహా వివిధ రంగాలలో భారతదేశం-జపాన్ స్నేహాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఆహ్వానించినందుకు మోదీ జపాన్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. బోధి వృక్షం పెరుగుదలతో పాటు భారతదేశం-జపాన్ సంబంధాలు పెరుగుతాయని తాను నమ్ముతున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడి ప్రవాస భారతీయులతో హిరోషిమాలోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసులు "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" అంటూ, ప్రధాని మోదీని అభినందిస్తూ నినాదాలు కూడా చేశారు.