Kathmandu: కాఠ్మాండు రణరంగం.. ఒకవైపు వరదలు, మరోవైపు అణచివేత
ఈ వార్తాకథనం ఏంటి
పునరావాసం కల్పించకుండా నిరుపేద కుటుంబాలను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ నేపాల్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. సామాజిక కార్యకర్తలపై పోలీసులు అణచివేతకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వందలాది మంది యువతీ యువకులు కాఠ్మాండులో రోడ్లపైకి వచ్చారు. గృహ హక్కులను పరిరక్షించాలని,బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కార్యాలయం ఎదుట భారీగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గృహ హక్కుల కోసం భారీ ఆందోళన 'జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్'పిలుపుతో కాఠ్మాండులోని సింహదర్బార్ సెక్రటేరియట్ సమీపంలోని మైతీఘర్ మండలాలో ఈ నిరసన జరిగింది. పేదకుటుంబాలను వేధించడం తక్షణమే నిలిపివేయాలని,మానవ హక్కులను గౌరవించాలని, అక్రమ అరెస్టులకు ముగింపు పలకాలని,నిరాశ్రయులైన కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించాలని నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని కోరారు.
వివరాలు
వరదల తర్వాత పోలీసుల చర్యలతో ఉద్రిక్తత
శుక్రవారం రాత్రి కాఠ్మాండులోని కీర్తీపూర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ తాత్కాలిక పునరావాస కేంద్రం వరద ముంపునకు గురైంది. అక్కడ సుమారు 150 మంది నిరుపేదలు ఆశ్రయం పొందుతున్నారు. భద్రతా సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, మరుసటి రోజు పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన 'జెన్ జీ' యువ సామాజిక కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకోగా, ఒక నిరసనకారుడి ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కాఠ్మాండులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలు
అరెస్టులపై విమర్శలు
పోలీసుల వ్యవహారంపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారుల అరెస్టులను ఖండించిన ఆయన, అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఆదివారం కోశి ప్రాంతంలోని మోరంగ్ జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట శాంతియుతంగా ఆందోళన చేపట్టిన 26 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు
వివాదానికి కారణమైన నివాసాల ఖాళీ ప్రక్రియ
ఈ ఏడాది ప్రారంభంలో నేపాల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నివాసాల ఖాళీ కార్యక్రమమే ప్రస్తుతం నెలకొన్న వివాదానికి ప్రధాన కారణంగా మారింది. ఏప్రిల్లో కాఠ్మాండు లోయతో పాటు ఇతర ప్రాంతాల్లోని పేదల బస్తీలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ చర్యలతో సుమారు 2,600 కుటుంబాలకు చెందిన 15 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
వివరాలు
వివాదానికి కారణమైన నివాసాల ఖాళీ ప్రక్రియ
బాధితుల్లో వందలాది మందిని ప్రభుత్వం తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ, జూలై 6 నాటికి ఆ కేంద్రాలను కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే శాశ్వత పునరావాసంపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో డజన్ల కొద్దీ కుటుంబాలు ఇప్పటికీ అదే తాత్కాలిక కేంద్రాల్లోనే జీవనం కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.