Loading...
Priya Adhikari: 7 రోజుల్లో 100 రెస్క్యూ ఆపరేషన్లు.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ సాహసం..
నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ సాహసం..

Priya Adhikari: 7 రోజుల్లో 100 రెస్క్యూ ఆపరేషన్లు.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ సాహసం..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌ను వరదలు, కొండచరియలు తీవ్రంగా దెబ్బతీశాయి. భారీగా జరిగిన విధ్వంసంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది ఆచూకీ లేకుండా పోయారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఈ రెస్క్యూ చర్యల్లో నేపాల్‌ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి తన ధైర్యసాహసాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 41 ఏళ్ల ఆమె.. కేవలం వారం రోజుల్లోనే దాదాపు 100 రెస్క్యూ మిషన్లలో పాల్గొన్నారు. హై ఆల్టిట్యూడ్ రెస్క్యూ పైలట్‌గా ప్రియా అధికారి మంచి అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం రసువా జిల్లాలో వరదలకు తీవ్రంగా ప్రభావితమైన టిమురే ప్రాంతంలో ఆమె సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

వివరాలు 

2015లో భారీ భూకంపం సమయంలో ఎదురైన సవాళ్ల కంటే కూడా క్లిష్టంగా

అక్కడ చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు సుమారు 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి.

ఒకేసారి ఐదు నుంచి ఆరు హెలికాప్టర్లు ల్యాండ్ చేయాల్సి వస్తుండటంతో పైలట్లు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

అయితే వరదల కారణంగా పెద్దఎత్తున బురద పేరుకుపోవడంతో హెలికాప్టర్లను ల్యాండ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రియా తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులు 2015లో నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం సమయంలో ఎదురైన సవాళ్ల కంటే కూడా క్లిష్టంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్ బరువును నేల భరించగలదా? లేదా? అనే విషయాన్ని కూడా ముందుగా అంచనా వేయలేని పరిస్థితి ఉందన్నారు.

వివరాలు 

ప్రియా అధికారి తెగువపై పలువురు ప్రశంసలు

ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో హెలికాప్టర్‌ను పూర్తిగా నిలిపివేయకుండా ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచి బాధితులను అందులోకి ఎక్కించుకుంటున్నారు.

ఆ వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతున్నట్లు ప్రియా వివరించారు.

టిమురేలో రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించిన తొలి రెండు రోజుల్లోనే 200మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.

అయితే సహాయక చర్యల్లో భాగంగా ఆకాశం నుంచి చూస్తున్న విధ్వంస దృశ్యాలు,మృతదేహాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు.

వరుసగా రెస్క్యూ మిషన్లు నిర్వహించడం వల్ల పైలట్లు శారీరకంగా,మానసికంగా తీవ్రంగా అలసిపోతున్నప్పటికీ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే తాము శిక్షణ పొందామని ఆమె స్పష్టం చేశారు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా బాధితుల కోసం పనిచేస్తున్న ప్రియా అధికారి తెగువపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రాణాలను పణంగా పెట్టి వారం రోజుల్లో 100 రెస్క్యూ మిషన్లు.. ప్రియా సాహసం

ADVERTISEMENT