Taliban: రూ.1 ట్రిలియన్ ఖనిజ సంపద.. అమెరికాకు తాలిబన్ భారీ ఆఫర్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తమ దేశంలోని విస్తారమైన ఖనిజ సంపదలో అమెరికా పెట్టుబడిదారులకు అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ఇందుకు ప్రతిగా అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు విదేశాల్లో నిలిపివేసిన అఫ్గాన్ ఆస్తుల్లో బిలియన్ల డాలర్లను విడుదల చేయాలని కోరింది. అమెరికా నేతృత్వంలోని నాటోదళాలు అఫ్గానిస్థాన్ నుంచి వైదొలిగిన తర్వాత తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చింది. తాలిబన్ తిరిగి అధికారంలోకి రావడాన్ని తీవ్రంగా విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా దళాల ఉపసంహరణ,ఆతర్వాత అమెరికా మద్దతుతో ఉన్న అఫ్గాన్ ప్రభుత్వం కూలిపోవడాన్ని గతంలో''అమెరికా చరిత్రలోనే అత్యంత అవమానకరమైన పరిణామం''గా ట్రంప్ అభివర్ణించారు.
వివరాలు
అమెరికా పెట్టుబడులకు అఫ్గాన్ ఆహ్వానం
అమెరికా పెట్టుబడులకు అఫ్గానిస్థాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ వెల్లడించినట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' తెలిపింది.
మైనింగ్, మౌలిక వసతులు, వ్యవసాయం, వాణిజ్యం తదితర రంగాల్లో అమెరికా పెట్టుబడులను స్వాగతిస్తామని ఆయన చెప్పారు.
గత 20 ఏళ్ల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని అఫ్గానిస్థాన్-అమెరికా సంబంధాలను అంచనా వేయకూడదని ముత్తఖీ పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహకారం ఎలా ఉంటుందన్నదే ప్రాతిపదికగా సంబంధాలను చూడాలని అన్నారు.
అఫ్గానిస్థాన్ ఆర్థిక విధానం విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ఉందని తెలిపారు.
వివరాలు
తాలిబన్ చెబుతున్న రూ.1 ట్రిలియన్ ఖనిజ సంపద
అమెరికా,గతంలో పాశ్చాత్య దేశాల మద్దతు పొందిన అఫ్గాన్ ప్రభుత్వం నిర్వహించిన భౌగోళిక సర్వేల ప్రకారం.. అఫ్గానిస్థాన్లో కనీసం 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ సంపద ఉన్నట్లు అంచనా.
ఇందులో రాగి,ఇనుప ఖనిజం,నియోబియం,కోబాల్ట్, బంగారం, లిథియం వంటి విలువైన వనరులు ఉన్నాయి.
దశాబ్దాలుగా కొనసాగిన ఘర్షణల కారణంగా వీటిలో చాలా వరకు ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.
అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబన్లు విదేశీ పెట్టుబడులను ఆకర్షించి సహజ వనరులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
2021 నుంచి చైనా, ఇరాన్ సహా పలు దేశాలతో కలిసి 7 బిలియన్ డాలర్లకు పైగా విలువైన మైనింగ్ పెట్టుబడులను ప్రకటించినట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' తెలిపింది.
బంగారం, విలువైన రాళ్లు, క్రోమైట్ వంటి వనరులపై ఈ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
వివరాలు
ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో అఫ్గానిస్థాన్
నాటో దళాల ఉపసంహరణ తర్వాత భద్రతా పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ.. అఫ్గానిస్థాన్ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా ఉంది.
దాదాపు 1.4 కోట్ల మంది ప్రజలు, అంటే దేశ జనాభాలో సుమారు మూడో వంతు మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' పేర్కొంది.
మహిళలు, బాలికలపై తాలిబన్లు విధించిన ఆంక్షలు అంతర్జాతీయ సంబంధాలకు ప్రధాన అడ్డంకిగా కొనసాగుతున్నాయి.
విద్య, ఉద్యోగాలు, ప్రజా జీవితంలో మహిళల భాగస్వామ్యంపై తాలిబన్లు తీవ్ర పరిమితులు విధించారు.
దీంతో అంతర్జాతీయంగా ఆ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు.. లింగ వివక్షకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో తాలిబన్ అధినేత హిబతుల్లా అఖుంద్జాదాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.
వివరాలు
ఆంక్షల ప్రభావంపై అమెరికా పెట్టుబడిదారులకు హెచ్చరికలు
అమెరికా పెట్టుబడిదారులు అఫ్గానిస్థాన్లో పెట్టుబడులు పెట్టాలంటే తాలిబన్ కీలక నేతలపై ఉన్న ఐక్యరాజ్యసమితి, పాశ్చాత్య దేశాల ఆంక్షలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని కాబూల్లోని విదేశీ దౌత్యవేత్తలు 'ఫైనాన్షియల్ టైమ్స్'కు తెలిపారు.
తాలిబన్ ప్రభుత్వంలోకి పెద్ద మొత్తంలో నిధులు వస్తే.. ఆ ప్రభుత్వం మరింత బలోపేతం కావచ్చని, దాని విధానాలపై అంతర్జాతీయ దేశాల ప్రభావం తగ్గిపోవచ్చని వారు హెచ్చరించారు.
అయినప్పటికీ తాలిబన్లు ఇటీవలి కాలంలో దౌత్య సంబంధాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చైనా, భారత్, ఇరాన్, ఖతార్, మధ్య ఆసియా దేశాల్లోని పలు దేశాలు కాబూల్తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి లేదా తాలిబన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తున్నాయి.
వివరాలు
ఆంక్షల ప్రభావంపై అమెరికా పెట్టుబడిదారులకు హెచ్చరికలు
గత ఏడాది రష్యా అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించింది.
ఈ ఏడాది మేలో అఫ్గానిస్థాన్తో సైనిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
యూరోపియన్ యూనియన్ కూడా జూన్లో బ్రస్సెల్స్లో తాలిబన్ ప్రతినిధులతో సమావేశమై వలసదారుల తిరిగి పంపకం వంటి అంశాలపై చర్చించింది.
2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వారితో ఈయూ నిర్వహించిన తొలి అధికారిక సమావేశం ఇదే. జర్మనీ కూడా ఇలాంటి చర్చలకు ప్రతిపాదించింది.
వివరాలు
స్తంభింపజేసిన అఫ్గాన్ ఆస్తులు విడుదల చేయాలని కాబూల్ డిమాండ్
అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలు పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో తమపై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయని, విదేశాల్లో నిలిపివేసిన అఫ్గాన్ నిల్వలు తిరిగి అందుతాయని తాలిబన్లు ఆశిస్తున్నారు.
ఆంక్షలు తమ ఉద్దేశాలను నెరవేర్చలేకపోయాయని ముత్తఖీ అన్నారు.
అఫ్గాన్ ప్రజల ఆస్తులను రాజకీయ ఒత్తిడికి సాధనంగా ఉపయోగించకూడదని ఆయన కోరారు.
అఫ్గాన్ కేంద్ర బ్యాంకు అంచనాల ప్రకారం.. సుమారు 9.5 బిలియన్ డాలర్ల విలువైన దేశ విదేశీ మారక నిల్వలు ఇప్పటికీ విదేశాల్లో ఉన్నాయి.
ఇందులో దాదాపు 7 బిలియన్ డాలర్లు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.
2022లో అమెరికా 3.5 బిలియన్ డాలర్లను స్విట్జర్లాండ్లోని 'అఫ్గాన్ ఫండ్'కు బదిలీ చేసింది. అఫ్గాన్ ఆర్థిక స్థిరత్వానికి ఈ నిధులను ఉపయోగించాలన్నది ఉద్దేశం.
వివరాలు
బాగ్రామ్ వైమానిక స్థావరంపై ట్రంప్ కన్ను
అయితే తాలిబన్లు నేరుగా ఈ డబ్బును వినియోగించుకోకుండా ఏర్పాట్లు చేశారు.
వడ్డీతో కలిపి ఈ ఫండ్ విలువ ప్రస్తుతం 4బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' తెలిపింది.
తాలిబన్లతో సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
కాబూల్కు ఉత్తరాన ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి అమెరికా నియంత్రణలోకి తీసుకురావాలని ఆయన ప్రతిపాదించారు.
అయితే ఈ ప్రతిపాదనను తాలిబన్లు తిరస్కరించారు. అఫ్గానిస్థాన్లోని బాగ్రామ్తో పాటు అన్ని సైనిక, పౌర సౌకర్యాలు దేశ జాతీయ ఆస్తులేనని ముత్తఖీ స్పష్టం చేశారు.
అదే సమయంలో కాబూల్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరవాలని వాషింగ్టన్ను కోరారు.
2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది.