Tarique Rahman: ఢాకాకు తిరిగి వచ్చిన తారిక్ రహమాన్.. ఇది భారత్కు ఎందుకు శుభవార్త?
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు, దేశ రాజకీయాల్లో "డార్క్ ప్రిన్స్"గా ప్రసిద్ధి చెందిన తారిక్ రహమాన్, దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఈ రోజు ఢాకాకు చేరుకున్నారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. రహమాన్ గడచిన సుమారు 20 సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో లేరు, అయినప్పటికీ ఆయన ఫోటోలు దేశవ్యాప్తంగా బీఎన్పీ పోస్టర్లపై కనిపించాయి. ర్యాలీల్లో ఆయన ఆడియో సందేశాలు ప్రసారం అయ్యాయి. ఆందోళనలు, హింసలతో గల బంగ్లాదేశ్లో బీఎన్పీకి తారిక్ రహమాన్ తిరిగి రావడం కీలక రాజకీయ ఘటనగా నిలిచింది. ఇది కేవలం బంగ్లాదేశ్కి మాత్రమే కాకుండా, ప్రాంతీయ భద్రతా దృష్ట్యా భారత్కు కూడా ప్రాముఖ్యం కలిగినది.
వివరాలు
భారత్ దృష్టిలో ఆయన రాకకు అత్యంత ప్రాధాన్యం
బీఎన్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న తారిక్ రహమాన్, భార్య డాక్టర్ జుబైదా రహమాన్, కుమార్తె జైమాతో కలిసి ఢాకాకు చేరారు. "6,314 రోజుల తర్వాత బంగ్లాదేశ్ అడుగుపెట్టాను" అని ఆయన చేరిన వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్ దృష్టిలో ఆయన రాకకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో, హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్న బంగ్లాదేశ్లో, భారత్ అనుకూల అవామీ లీగ్ ఎన్నికల బరిలో గట్టిగా నిలవలేకపోతోంది. ఇంతకుముందు ఖలేదా జియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాలు
జమాత్ ఏ ఇస్లామీ సంస్థ పాకిస్థాన్ ఐఎస్ఐతో అనుబంధం
మధ్యంతర ప్రధానిగా మహమ్మద్ యూనస్ కొనసాగుతున్న వేళ తీవ్రవాద ఇస్లామిస్టులు రెచ్చిపోతూ భారత్కు వ్యతిరేకంగా ద్వేషం వ్యాప్తి చేస్తున్నారు. జమాత్ ఏ ఇస్లామీ సంస్థ పాకిస్థాన్ ఐఎస్ఐతో అనుబంధం కలిగి ఉందని ఊహిస్తున్న నిపుణులు ఉన్నారు. షేక్ హసీనా పాలనలో నిషేధించబడిన ఈ సంస్థ, ఆమె పదవి నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ రాజకీయ మైదానంలోకి ప్రవేశించింది. ఇటీవల చేసిన సర్వే ప్రకారం, ఎన్నికల్లో బీఎన్పీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, జమాత్ ఇప్పుడు బీఎన్పీకి గట్టి పోటీ ఇస్తోంది. ఢాకా విశ్వవిద్యాలయ ఎన్నికల్లో జమాత్ విద్యార్థి విభాగం అనూహ్య విజయం సాధించడం భారత్కి ఆందోళన కలిగించే విషయం.
వివరాలు
భారత దృష్ట్యా తారిక్ రహమాన్ రాకకు కారణాలు
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో,భారత్ బీఎన్పీని ఉదారవాద,ప్రజాస్వామ్య పార్టీగా చూస్తోంది. తారిక్ రహమాన్ తిరిగి రావడం వల్ల బీఎన్పీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపి,ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయగలదని భారత్ ఆశిస్తోంది. అంతేకాదు,ఎన్నికల్లో మరో శక్తిగా ఉన్న విద్యార్థి నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ నేతలు, బీఎన్పీ తమ పార్టీలో అనుకూల అవామీ లీగ్ సభ్యులను చేర్చుకుంటున్నారని ఆరోపించారు. హసీనా పాలనలో,బంగ్లాదేశ్-భారత్ సంబంధాలు బలపడ్డాయి.చైనా విషయంలో సమతుల్య విధానం, పాకిస్థాన్తో దూరంగా ఉండడం హసీనా కాలంలో కనిపించింది. యూనస్ పాలనలో పరిస్థితి భిన్నంగా మారి,భారత్తో దూరంగా ఉండి,పాకిస్థాన్కి ప్రాధాన్యం ఇచ్చారు. బీఎన్పీ అధికారంలోకి వస్తే,బంగ్లాదేశ్ విదేశాంగవిధానంలో మార్పు వస్తుందని భారత్ ఆశిస్తోంది. ఇటీవల బీఎన్పీ-భారత్ సంబంధాలు పున:పరిశీలన దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
ఖలేదా జియా ఆరోగ్యంపై భారత్ ఆందోళన
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖలేదా జియా ఆరోగ్యం పై, 1 డిసెంబరు 2025న ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసి మద్దతు ప్రకటించారు. బీఎన్పీ దీన్ని సానుకూలంగా స్వీకరించింది, ఇది రాజకీయంగా మంచి సంకేతం. మధ్యంతర ప్రభుత్వంతో తారిక్ రహమాన్ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆయా దీర్ఘకాలిక విదేశాంగ నిర్ణయాలపై ప్రశ్నిస్తూ, జమాత్తో పొత్తుపెట్టనని స్పష్టంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆరంభంలో తారిక్ రహమాన్ "బంగ్లాదేశ్ ఫస్ట్" విదేశాంగ విధానం ప్రకటించారు, ఇది అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ "అమెరికా ఫస్ట్" విధానాన్ని పోలి ఉంది.
వివరాలు
రహమాన్కి ఘనస్వాగతం
ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా తాను నిలుస్తున్న తారిక్ రహమాన్, ఢాకా విమానాశ్రయంలో ఘన స్వాగతం పొందారు. విమానాశ్రయం నుండి ఆయన నివాసం వరకు జరిగిన రోడ్షోలో సుమారు 50 లక్షల మంది బీఎన్పీ కార్యకర్తలు పాల్గొన్నారు. తారిక్ రహమాన్ బొగురా-6 సదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంది. బీఎన్పీ అధ్యక్షురాలు జియా, బొగురా-7 గబ్తలి-షాజాహాన్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. రోడ్షోలో బలమైన ప్రదర్శనతో, తీవ్రవాద శక్తులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు బీఎన్పీ, జమాత్ మధ్య ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, ఇది రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్న అంశం.