Trump: 'వాళ్లు బాత్రూమ్కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది'.. ఇరాన్ కదలికలపై ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్లోని పరిణామాలపై తమకు అత్యంత పకడ్బందీగా నిఘా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్కడ ఏం జరుగుతుందనే విషయం తమకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుందని చెప్పారు. అవసరమైతే ఇరాన్పై మరోసారి దాడి చేసేందుకు అమెరికా వెనుకాడబోదని స్పష్టం చేశారు.
వివరాలు
ఇరాన్ కదలికలపై పూర్తి సమాచారం
ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఘర్షణ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
ఇరాన్ చేపడుతున్న ప్రతి కదలికపై అమెరికాకు సమాచారం అందుతోందని పేర్కొన్నారు. తమ నిఘా వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో చెప్పేందుకు.. ''వాళ్లు బాత్రూమ్కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది'' అంటూ వ్యాఖ్యానించారు.
హర్మూజ్పై అమెరికా నిఘా
హర్మూజ్ జలసంధిపై అమెరికాకు బలమైన పట్టు ఉందని ట్రంప్ వెల్లడించారు.
ఈ ప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేస్తున్న రాడార్, క్షిపణి వ్యవస్థలను అమెరికా గుర్తించిందని చెప్పారు.
సముద్రంలో మైన్స్ అమర్చేందుకు ఇరాన్ సిద్ధం చేస్తున్న ఓ రాకెట్ను అమెరికా దాడుల్లో ధ్వంసం చేసినట్లు తెలిపారు.
వివరాలు
అమెరికా దాడుల్లో 18 మంది మృతి
ఇటీవల అమెరికా చేపట్టిన దాడుల్లో ఇరాన్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 108 మంది గాయపడ్డారని సమాచారం.
హర్మూజ్ జలసంధికి సమీపంలోని కుహెస్తాక్లో జరిగిన ఓ వివాహ వేడుకను కూడా అమెరికా దాడి చేసినట్లు టెహ్రాన్ ఆరోపించింది.
మరోవైపు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగింది.
కువైట్, జోర్డాన్, యూఏఈ, బహ్రెయిన్తో పాటు ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
కువైట్లో ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి, డ్రోన్ దాడిని తమ బలగాలు అడ్డుకున్నాయని అక్కడి సైన్యం వెల్లడించింది.