Trump: నవంబర్ ఎన్నికల ముందు ట్రంప్ కీలక నిర్ణయం.. ఇరాన్ యుద్ధానికి ముగింపు?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక నిర్ణయం తీసుకునే అంశాన్ని తన సన్నిహిత సలహాదారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందే యుద్ధాన్ని ముగిసినట్లు ప్రకటించే అవకాశంపై ఆయన ఆలోచిస్తున్నట్లు 'ది వాల్స్ట్రీట్ జర్నల్' కథనం పేర్కొంది. ఇరాన్పై ఇటీవలి దాడులకు మించి యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తే నవంబర్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు నష్టం జరిగే అవకాశం ఉందని ట్రంప్ సలహాదారులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని విస్తరించకుండా ప్రస్తుత పరిస్థితిని అదుపులో ఉంచాలని వారు ట్రంప్కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
యుద్ధం కంటే ఆర్థిక ఒత్తిడికే ప్రాధాన్యం
అయితే ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు.
హర్ముజ్ జలసంధి విషయంలోనూ ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.
అప్పుడప్పుడు ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ యుద్ధానికి ముగింపు పలికినట్లు ప్రకటించి ఆర్థిక ఒత్తిడిని కొనసాగించాలనే ఆలోచనకు ట్రంప్ మొగ్గుచూపుతున్నట్లు 'వాల్స్ట్రీట్ జర్నల్' తెలిపింది.
ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను కొనసాగిస్తే చివరకు అక్కడి ప్రభుత్వం తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాల్సి వస్తుందని, లేదంటే ఆర్థిక ఒత్తిడితో కూలిపోయే పరిస్థితి వస్తుందని ట్రంప్ భావిస్తున్నట్లు కథనం పేర్కొంది.
యుద్ధం ఏడో నెలకు చేరుకున్న నేపథ్యంలో.. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు.
వివరాలు
నవంబర్ ఎన్నికల వరకు సంయమనం పాటించాలని ఒత్తిడి
ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచి, ఆ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఇందులో భాగంగా టెహ్రాన్పై భారీగా ఆంక్షలు విధించారు.
యుద్ధంలో మరింత తీవ్రతరం చేసే చర్యలు చేపడితే అది నవంబర్ ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయావకాశాలను దెబ్బతీయవచ్చని ట్రంప్కు ఆయన సలహాదారులు వివరించినట్లు సమాచారం.
అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తాను యుద్ధ నిర్ణయాలు తీసుకోవడం లేదని ట్రంప్ తన సహాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో రాయిటర్స్ కూడా ట్రంప్ సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది.
నవంబర్ మధ్యంతర ఎన్నికల వరకు ఇరాన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయకుండా చూడాలని ట్రంప్పై ఆయన సలహాదారులు ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంది.
వివరాలు
ఎన్నికల వేళ యుద్ధంపై వెనక్కి తగ్గుతున్న ట్రంప్?
తద్వారా ఎన్నికల్లో రిపబ్లికన్లకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని వారు భావిస్తున్నట్లు తెలిపింది.
నవంబర్ 3న జరిగే ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం సైనిక చర్యలను మరింత పెంచే అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది.
ప్రస్తుతం అమెరికా దృష్టి సైనిక చర్యల కంటే ఆర్థిక ఆంక్షలపైనే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
''మేం ఇరాన్పై ఒత్తిడి కొనసాగిస్తున్నాం.కానీ నవంబర్ ఎన్నికలు మాకు ప్రాధాన్యం''అని వైట్హౌస్ అధికారి ఒకరు రాయిటర్స్కు వెల్లడించినట్లు కథనం పేర్కొంది.
ఎన్నికల వరకు యుద్ధాన్ని ఎక్కువగా పరిమితం చేయడం వల్ల అది ప్రధాన ఎన్నికల అంశంగా మారకుండా ఉంటుందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి.
సెనేట్,ప్రతినిధుల సభలో ఉన్న స్వల్ప మెజారిటీలను కాపాడుకునేందుకు రిపబ్లికన్లు ప్రచారం నిర్వహించాల్సి ఉంది.
వివరాలు
పశ్చిమాసియాలో 50 వేల అమెరికా సైనికులు.. ట్రంప్కు కీలక ఆప్షన్లు
ఈ సమయంలో ప్రజాదరణ లేని యుద్ధం ఎన్నికలపై ప్రభావం చూపకుండా చూడాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, పశ్చిమాసియాలో దాదాపు 50 వేల మంది అమెరికా సైనికులు ప్రస్తుతం ఉన్నట్లు 'వాల్స్ట్రీట్ జర్నల్' తెలిపింది.
దీంతో అవసరమైతే సైనిక చర్యలను వేగంగా పెంచే అవకాశం ట్రంప్కు ఉంటుందని పేర్కొంది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడం, ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడం, ఇరాన్ నౌకాశ్రయాలు, తీర ప్రాంతాలపై దిగ్బంధం వంటి చర్యలను అమెరికా బలగాలు చేపడుతున్నాయి.
వివరాలు
పశ్చిమాసియాలో 50 వేల అమెరికా సైనికులు.. ట్రంప్కు కీలక ఆప్షన్లు
గత నెలలో ఇరాన్పై తదుపరి చర్యలకు సంబంధించి ట్రంప్కు పలు ప్రతిపాదనలు అందినట్లు సమాచారం.
ఇందులో భారీగా వైమానిక దాడులు చేయడం, హోర్ముజ్ సమీపంలోని ఇరాన్ దీవులను స్వాధీనం చేసుకునేందుకు భూతల బలగాలను పంపడం, రహస్య అణు కార్యకలాపాలకు సంబంధం ఉండొచ్చని భావిస్తున్న పికాక్స్ మౌంటెన్ ప్రాంతంపై దాడులు చేయడం వంటి ఎంపికలు ఉన్నట్లు కథనం పేర్కొంది.