US-Iran Talks: దోహా చర్చలపై ఖతార్ ఆశాభావం.. అమెరికా-ఇరాన్ మధ్య సానుకూల సంకేతాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా,ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన పరోక్ష చర్చలు ప్రయోజనకరంగా సాగాయని ఖతార్ వెల్లడించింది. ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందంలోని అంశాల అమలులో పురోగతి నమోదైందని,తదుపరి విడత చర్చలను కూడా కొనసాగించనున్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం మంచి అవగాహన నెలకొందని, అణు కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
అణు ఒప్పందంపై కనిపించని పురోగతి
ఇరు దేశాల మధ్య విభేదాలు క్రమంగా తగ్గుతున్నాయని,హర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, కాల్పుల విరమణ కొనసాగింపు వంటి కీలక అంశాలపై కూడా చర్చలు సానుకూలంగా సాగాయని తెలిపారు. అయితే తుది అణు ఒప్పందంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి కనిపించలేదని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. తాజా దోహా సమావేశాల్లో ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, ఇరాన్కు సంబంధించిన నిధుల విడుదల వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తైన అనంతరం తదుపరి విడత చర్చలు నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.