Two-wheeler industry: 2027లో భారత ద్విచక్ర వాహన మార్కెట్కు బూస్ట్.. 5-8% వృద్ధి అంచనా
ఈ వార్తాకథనం ఏంటి
భారత ద్విచక్ర వాహన పరిశ్రమకు వచ్చే ఆర్థిక సంవత్సరం (FY2027)లో మోస్తరు వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని జాటో డైనమిక్స్ (Jato Dynamics) అధ్యయనం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని టూ-వీలర్ మార్కెట్ 5-8 శాతం మేర వృద్ధి చెందవచ్చు. స్థిరమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలవనున్నాయి. అయితే ఈ విభాగంలో కేవలం విక్రయాల సంఖ్య కంటే.. వినియోగదారుల డిమాండ్ ఏ మోడళ్ల వైపు మారుతోంది అనేది మరింత కీలకంగా మారనుంది.
వివరాలు
స్కూటర్లకు పెరగనున్న డిమాండ్
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్ల వాటా మరింత పెరిగే అవకాశం ఉందని జాటో డైనమిక్స్ అంచనా వేసింది.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్కూటర్లకు బలమైన డిమాండ్ ఉండటంతో ఈ విభాగం మరింత పుంజుకోనుందని పేర్కొంది.
అదే సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (EV) వినియోగం కూడా పెరగనుంది. దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వాటా 7-9 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
అయితే ఈ వృద్ధి సబ్సిడీల కొనసాగింపు, ధరల విధానం, ఛార్జింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
ఇప్పటివరకు ఈ అంశాలే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విస్తరణకు కీలకంగా పనిచేశాయని తెలిపింది.
వివరాలు
హోండా, టీవీఎస్ దూకుడు
తయారీ సంస్థల (OEMs) పరంగా చూస్తే.. మోటార్సైకిల్ విభాగంలో హోండా మరింత పట్టు సాధించే అవకాశం ఉందని జాటో డైనమిక్స్ అంచనా వేసింది.
స్కూటర్ విభాగంలోనూ హోండా తన ఆధిపత్యాన్ని కొనసాగించనుందని పేర్కొంది.
మరోవైపు టీవీఎస్ మోటార్ కంపెనీ మోటార్సైకిళ్లు, స్కూటర్లు.. రెండు విభాగాల్లోనూ పురోగతి సాధిస్తోందని నివేదిక తెలిపింది.
హీరో మోటోకార్ప్ విషయానికి వస్తే.. మోటార్సైకిల్ విభాగంలో 42 శాతం భారీ మార్కెట్ వాటా ఉన్నప్పటికీ, స్కూటర్ల విభాగంలో మాత్రం కంపెనీ వాటా కేవలం 6.6 శాతంగా ఉందని జాటో డైనమిక్స్ పేర్కొంది.
వివరాలు
ఈవీ డిమాండ్ పెరిగితే ఎవరికీ లాభం?
భారత్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీకరణ వేగం పెరిగితే.. స్కూటర్ విభాగంలో బలంగా ఉన్న టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి సంస్థలు ఎక్కువగా లాభపడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
అయితే ఈవీలకు మారే వేగం మందగిస్తే.. మోటార్సైకిళ్లపై ఎక్కువగా ఆధారపడిన సంస్థలు ప్రస్తుత స్థాయిలో స్థిరంగా కొనసాగవచ్చని అంచనా వేసింది.
అంటే భవిష్యత్తులో వినియోగదారుల డిమాండ్ పెట్రోల్ మోటార్సైకిళ్ల నుంచి స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎంత వేగంగా మళ్లుతుందనే దానిపై మార్కెట్ పరిస్థితులు మారవచ్చని జాటో డైనమిక్స్ తెలిపింది.
వివరాలు
పండగ సీజన్లో అమ్మకాల జోరు
భారత మోటార్సైకిల్ మార్కెట్లో సీజనల్ ప్రభావం కూడా కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పండగల సీజన్లో మోటార్సైకిళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
భారత ద్విచక్ర వాహన పరిశ్రమలో నిర్మాణాత్మక మార్పు చోటుచేసుకుంటోందని జాటో డైనమిక్స్ అధ్యయనం వెల్లడించింది.
గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో పెట్రోల్ మోటార్సైకిళ్ల విక్రయాలే మార్కెట్ వృద్ధికి ప్రధాన ఆధారంగా ఉండటం లేదని పేర్కొంది.
అదనపు డిమాండ్ ఎక్కువగా స్కూటర్ల వైపు, ముఖ్యంగా వాటిలో ప్రారంభ దశలో ఉన్న ఎలక్ట్రిఫికేషన్ వైపు మళ్లుతోందని తెలిపింది. వినియోగదారుల అభిరుచులు, మార్కెట్ డైనమిక్స్లో వస్తున్న ఈ మార్పు.. భవిష్యత్తులో భారత ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధికి స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఎంత కీలకంగా మారనున్నాయో సూచిస్తోందని నివేదిక పేర్కొంది.