E20: ఈ20 పెట్రోల్తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ ప్రయోజనాలు ఎక్కువే: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఇథనాల్ను 20 శాతం కలిపిన ఈ20 పెట్రోల్ వాడితే కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, దీనివల్ల అధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన పికప్, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయని పేర్కొంది. ఈ20 పెట్రోల్పై ఇటీవల వస్తున్న సందేహాలు, విమర్శల నేపథ్యంలో చమురు మంత్రిత్వ శాఖ శుక్రవారం 'సందేహాలు-సమాధానాలు' పేరుతో ప్రత్యేక సమాచార పత్రాన్ని విడుదల చేసింది.
వివరాలు
దశలవారీగా అమలు చేశామన్న కేంద్రం
ఈ20 పెట్రోల్ను హఠాత్తుగా దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. శాస్త్రీయ పరీక్షలు నిర్వహించడం, ఆటోమొబైల్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరపడం, దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచిన తర్వాతే ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేశామని వివరించింది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగాత్మక ప్రాజెక్టును 2001లో ప్రారంభించగా, 2006 నాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో 5 శాతం బ్లెండింగ్ను అమలు చేసినట్లు తెలిపింది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో సగటు ఇథనాల్ బ్లెండింగ్ కేవలం 1.5 శాతం మాత్రమే ఉండేదని పేర్కొంది. అనంతరం 2022 నాటికి 10 శాతం లక్ష్యాన్ని చేరుకోగా, 2025-26 నాటికి 20 శాతం బ్లెండింగ్ను దశలవారీగా అమలు చేసే స్థాయికి చేరుకున్నామని వెల్లడించింది.
వివరాలు
పాత వాహనాలకు నష్టం లేదని వివరణ
ఈ20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయన్న ఆందోళనలపై కూడా కేంద్రం స్పందించింది. దేశవ్యాప్తంగా వినియోగానికి అనుమతి ఇవ్వకముందే ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థ పనితీరు, విడిభాగాల అనుకూలత, తుప్పు నిరోధకత, కాలుష్య ఉద్గారాలపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. వాస్తవ వినియోగ పరిస్థితుల్లో ఈ20 కారణంగా తుప్పు పట్టడం, విడిభాగాలు దెబ్బతినడం వంటి సమస్యలు సర్వీస్లో ఉన్న వాహనాల్లో నిరూపితం కాలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ సంస్థల అభిప్రాయాలను కూడా ప్రస్తావించింది.
వివరాలు
ప్యూర్, ఈ10, ఈ20 పెట్రోల్ ఎంపిక సాధ్యం కాదా?
వినియోగదారులకు ప్యూర్ పెట్రోల్, ఈ10, ఈ20 వంటి వేర్వేరు ఇంధన ఎంపికలు ఇవ్వాలన్న డిమాండ్పైనా కేంద్రం స్పందించింది. అన్ని రకాల ఇంధనాలను ఒకేసారి సరఫరా చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై భారీ భారం పడుతుందని తెలిపింది. దీంతో లాజిస్టిక్ ఖర్చులు పెరగడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా పెట్రోల్ బంకులకు ఇంధన పంపిణీ మరింత క్లిష్టంగా మారుతుందని వివరించింది.
వివరాలు
ధరపై కేంద్రం ఏమంది?
ఈ20 పెట్రోల్ ధరపై వస్తున్న ప్రశ్నలకు కూడా కేంద్రం సమాధానం ఇచ్చింది. రైతులకు మెరుగైన ఆదాయం అందించాలనే ఉద్దేశంతో ఇథనాల్ కొనుగోలుకు ప్రభుత్వం నిర్దిష్ట ధరను నిర్ణయించినట్లు పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన సందర్భాల్లో ఈ20 పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అందువల్ల ఈ20 పెట్రోల్ సంప్రదాయ పెట్రోల్ కంటే తక్కువ ధరకు లభిస్తుందని భావించడం సరైంది కాదని స్పష్టం చేసింది.
వివరాలు
విదేశీ మారకంలో భారీ ఆదా
ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల దేశానికి రూ.1.97 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే సుమారు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు 952 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపులో ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపింది. ఇక 2014-15 నుంచి ఇప్పటి వరకు ఇథనాల్ సరఫరా ద్వారా రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు వివరించింది. ఈ20 పెట్రోల్పై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దని కేంద్రం ప్రజలకు సూచించింది.