LOADING...
Tata Motors: డీజిల్‌లో బయోఫ్యూయల్ కలయికకు కేంద్రం సిద్ధం.. టాటా మోటార్స్ ట్రయల్స్ ప్రారంభం
టాటా మోటార్స్ ట్రయల్స్ ప్రారంభం

Tata Motors: డీజిల్‌లో బయోఫ్యూయల్ కలయికకు కేంద్రం సిద్ధం.. టాటా మోటార్స్ ట్రయల్స్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెట్రోల్‌లో ఈ20 (E20)ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్‌లో కూడా బయోఫ్యూయల్ వినియోగాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ అనే అధిక సామర్థ్యం కలిగిన బయోఫ్యూయల్ ఆల్కహాల్‌ను కలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఇంధనాన్ని ఉపయోగించేందుకు వాహన ఇంజిన్లలో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. ఈ నిర్ణయం దేశ వాణిజ్య వాహనాల పరిశ్రమతో పాటు ఇంధన భద్రతపై కూడా కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ వచ్చే త్రైమాసికం నుంచి డీజిల్‌లో 2శాతం ఐసోబ్యూటనాల్ కలిపిన ఇంధనంతో పైలట్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించడమే లక్ష్యం 

ఇందుకోసం సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో కలిసి పనిచేస్తోంది. ప్రారంభ దశలో ఈ పరీక్షలను పరిమిత స్థాయిలో నిర్వహించనున్నారు. డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ, ప్రారంభ దశలో 2 శాతం మాత్రమే మిశ్రమం ఉండటంతో వాహనాల పనితీరుపై ఎలాంటి గణనీయమైన ప్రభావం ఉండదని తెలిపారు.

వివరాలు 

పెట్రోల్‌తో పాటు డీజిల్‌లో కూడా పరిమిత స్థాయిలో పరీక్షలు

ఐసోబ్యూటనాల్‌ను ఇప్పటికే అమెరికాలో రవాణా ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ పెట్రోల్‌తో పాటు డీజిల్‌లో కూడా పరిమిత స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. అయితే యూరప్ లేదా చైనాలో డీజిల్‌లో ఐసోబ్యూటనాల్‌ను తప్పనిసరిగా భారీ స్థాయిలో కలిపే వాణిజ్య కార్యక్రమం ఇప్పటివరకు అమలులో లేదు. దీంతో ఈ దిశగా భారత్ తీసుకుంటున్న నిర్ణయం ప్రపంచ బయోఫ్యూయల్ రంగంలో కూడా ప్రాధాన్యం సంతరించుకోనుంది.

Advertisement

వివరాలు 

వాణిజ్య వాహనాల రంగానికి ఎంతో కీలకం

డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ కలయిక ముఖ్యంగా వాణిజ్య వాహనాల రంగానికి ఎంతో కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు, సహజ వాయువుతో నడిచే వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ, సుదూర ప్రయాణాలు చేసే మధ్యతరహా, భారీ ట్రక్కులు ఇప్పటికీ ప్రధానంగా డీజిల్‌పైనే ఆధారపడుతున్నాయి. మరోవైపు తయారీ సంస్థలు విద్యుదీకరణ ప్రయత్నాలను ప్రధానంగా బస్సులు, చిన్న సరుకు రవాణా వాహనాలపై కేంద్రీకరించగా, అధిక బరువును మోయాల్సిన వాహనాలకు డీజిల్ ఇప్పటికీ ప్రధాన ఇంధనంగా కొనసాగుతోంది.

Advertisement