Maruti: E20 ఇంధనం కారణంగా కారు సమస్యలు.. కొత్త కారు ఇవ్వాలని మారుతి సుజుకీకి వినియోగదారుల కమిషన్ ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
మారుతి సుజుకీకి రాయ్పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. E20 ఇంధనానికి అనుకూలంగా లేని కారు ఇవ్వడం వల్ల సమస్యలు ఎదురయ్యాయని వినియోగదారు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్, ఆయనకు కొత్త E20-కంపాటిబుల్ గ్రాండ్ విటారా ఎస్యూవీని అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా, మానసిక వేధింపులు, న్యాయపరమైన ఖర్చుల కింద పరిహారం కూడా చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని 45 రోజుల లోపు చెల్లించాలని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు డాక్టర్ ప్రేమ్రాజ్ దేబ్తా జూన్ 2024లో మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జీటా+ వేరియంట్ను కొనుగోలు చేశారు.
వివరాలు
ఎథనాల్ వల్ల ఆ సమస్య?
అయితే జనవరి 2023లో తయారైన ఈ వాహనంలో కొనుగోలు చేసిన ఐదు నెలలకే తరచూ ఆగిపోవడం (స్టాలింగ్) వంటి సాంకేతిక సమస్యలు ప్రారంభమైనట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు అధీకృత సర్వీస్ సెంటర్ను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇంధన ట్యాంక్లో కలుషితం ఉన్నట్లు గుర్తించి దాన్ని శుభ్రం చేసినా సమస్య అలాగే కొనసాగిందని తెలిపారు.
దీంతో డాక్టర్ ప్రేమ్రాజ్ దేబ్తా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో ఇంధనాన్ని పరీక్షించగా, అందులో తెల్లటి పెరుగు మాదిరి పదార్థం ఉన్నట్లు తేలింది. దాన్ని ఎథనాల్గా గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది.
వివరాలు
మారుతి సుజుకీకి కీలక ఆదేశాలు..
అయితే, ఈ సమస్యకు నాసిరకం ఇంధనమే కారణమని, అది వారంటీ పరిధిలోకి రాదని మారుతి సుజుకీ అధీకృత డీలర్షిప్ వాదించింది.
ప్రయోగశాల పరీక్షల్లో ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలిందని, వాహన తయారీలో ఎలాంటి లోపం లేదని కంపెనీ తరఫు న్యాయవాదులు తెలిపారు.
అయితే అన్ని ఆధారాలను పరిశీలించిన కమిషన్ భిన్నమైన నిర్ణయానికి వచ్చింది.
వాహనం E20 ఇంధనానికి అనుకూలంగా లేకపోతే, ఆ విషయాన్ని కొనుగోలు చేసే ముందే వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉండేదని పేర్కొంది.
అలా చేయకపోవడం సేవల్లో లోపంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది.
దీంతో డాక్టర్ ప్రేమ్రాజ్ దేబ్తాకు 45 రోజులలోపు కొత్త E20-కంపాటిబుల్ గ్రాండ్ విటారా వాహనాన్ని అందించాలని మారుతి సుజుకీని కమిషన్ ఆదేశించింది.
వివరాలు
రూ.20,50,494ను తిరిగి చెల్లించాలని స్పష్టం..
ఒకవేళ కొత్త వాహనాన్ని ఇవ్వకపోతే, రూ.20,50,494ను తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది.
ఇది మానసిక వేధింపులు, న్యాయపరమైన ఖర్చుల కింద చెల్లించాల్సిన పరిహారానికి అదనంగా ఉంటుందని కమిషన్ పేర్కొంది.
ఇటీవలి కాలంలో E20 మిశ్రమ పెట్రోల్పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడింది.
ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఎథనాల్కు పెట్రోల్తో పోలిస్తే ఉష్ణశక్తి (క్యాలరిఫిక్ వ్యాల్యూ) తక్కువగా ఉంటుందని, కొన్ని పరిస్థితుల్లో అది వాహనాల మైలేజీపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలపై స్పందించారు.