Oil Prices: హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. వరుసగా నాలుగో రోజు పెరిగిన ముడిచమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి. సముద్ర మార్గంలో చమురు రవాణా భద్రతను కాపాడే లక్ష్యంతో అమెరికా ఇరాన్పై దాడులను కొనసాగించడంతో ప్రపంచ చమురు మార్కెట్లో ఆందోళనలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణించే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు 85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఇది దాదాపు 12 శాతం పెరిగింది.మరోవైపు అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర బ్యారెల్కు 80 డాలర్ల సమీపంలో కొనసాగుతోంది.
వివరాలు
అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు
బుధవారం కూడా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది.
అలాగే ఓపెక్ సభ్యదేశమైన ఇరాన్లోని ఓ నౌకాశ్రయానికి వెళ్తున్న ఖాళీ చమురు ట్యాంకర్ను నిర్వీర్యం చేసినట్లు ప్రకటించింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ఇంధన సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం నుంచి చమురు సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.
దీంతో గత త్రైమాసికంలో నమోదైన సుమారు 30 శాతం ధరల పతనంలో కొంత మేర కోలుకున్నాయి.
మరోవైపు రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, ట్యాంకర్లపై ఉక్రెయిన్ దాదాపు ప్రతిరోజూ జరుపుతున్న దాడులు కూడా ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఖార్గ్ దీవిపై చర్యలు తీసుకునే అంశంపైనా అమెరికా యంత్రాంగం చర్చలు
కార్లైల్ గ్రూప్ సీనియర్ సలహాదారు జెఫ్ కర్రీ మాట్లాడుతూ,హోర్ముజ్ జలసంధి మార్గంలో ఏర్పడిన అంతరాయాలతో పాటు రష్యాలోని చమురు ఉత్పత్తి,శుద్ధి వ్యవస్థలపై దాడులు ఇంధన రంగానికి తీవ్రమైన సవాలుగా మారాయని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులను ఇరాన్ నిలిపివేసి,ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి తెరిచే వరకు సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అలాగే ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్గా ఉన్న ఖార్గ్ దీవిపై చర్యలు తీసుకునే అంశంపైనా అమెరికా యంత్రాంగం చర్చిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
అయితే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు.
వివరాలు
ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధనాన్ని నిలిపివేసే వరకు జలసంధిని తెరవం: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్
అమెరికా దాడులు, ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధనాన్ని నిలిపివేసే వరకు హోర్ముజ్ జలసంధిని తెరవబోమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది.
ఈ పరిస్థితి మరికొన్ని వారాలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు.
హోర్ముజ్ మార్గంలో రవాణా సాధారణ స్థితికి రాకపోతే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఇరాన్ చమురు ట్యాంకర్లపై జరుపుతున్న దాడుల కారణంగా పర్షియన్ గల్ఫ్ నుంచి ముడిచమురును బయటకు తరలించేందుకు వినియోగిస్తున్న 'షటిల్ రన్స్' విధానం కూడా దెబ్బతింటోంది.
వివరాలు
హోర్ముజ్ జలసంధిని దాటిన పది కంటే ఎక్కువ నౌకలు
ఈ విధానంలో హోర్ముజ్ జలసంధి వెలుపల ఇతర నౌకలకు ముడిచమురును బదిలీ చేస్తుంటారు.
యుద్ధ పరిస్థితుల్లో ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారింది.
అయితే ఈ ఉద్రిక్తతల మధ్య కూడా చమురు ట్యాంకర్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోలేదు.
అమెరికా సైన్యం సహాయంతో మంగళవారం రాత్రి పది కంటే ఎక్కువ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
గత వారం ఈ మార్గంలో ప్రయాణించిన సుమారు 300 నౌకల్లో దాదాపు సగం నౌకలకు అమెరికా దళాలు భద్రత కల్పించినట్లు తెలిపింది.
వివరాలు
17 లక్షల బ్యారెళ్ల మేర తగ్గిన అమెరికా ముడిచమురు నిల్వలు
ఇదిలా ఉండగా, గత వారం అమెరికాలో ముడిచమురు నిల్వలు దాదాపు 17 లక్షల బ్యారెళ్ల మేర తగ్గినట్లు ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
చమురు ఎగుమతులు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. అయితే యుద్ధానికి ముందు ఉన్న సగటు స్థాయితో పోలిస్తే ఎగుమతులు ఇంకా తక్కువగానే ఉన్నాయని తెలిపింది.
మరోవైపు ఓక్లహోమాలోని కుషింగ్ డెలివరీ హబ్లో నిల్వలు 2 కోట్ల బ్యారెళ్ల మార్కును దాటినట్లు వెల్లడించింది.