E20 Petrol: E20పై ఆందోళనలు.. E10 పెట్రోల్ను మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం?
ఈ వార్తాకథనం ఏంటి
E20 పెట్రోల్పై వాహనదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న XP95, SPEED, Power95 వంటి బ్రాండెడ్ పెట్రోల్ను E10 రూపంలో విక్రయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇలా చేస్తే E10 కోసం ప్రత్యేకంగా నిల్వ, పంపిణీ మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణ E20 ఇంధనంపై సందేహాలు ఉన్న పలువురు వినియోగదారులు ఇప్పటికే అధిక ఆక్టేన్ కలిగిన ప్రీమియం ఇంధనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ.. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది.
వివరాలు
పాత వాహనాల్లో E20 ప్రభావంపై ఆందోళనలు..
E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజిన్లపై ప్రభావం పడుతుందా?
ఇంధన మైలేజీ తగ్గుతుందా? అనే సందేహాలను వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం E20 వినియోగంపై పలు హామీలు ఇస్తోంది.
అయినప్పటికీ గత కొన్ని నెలలుగా పాత వాహనాలకు మరింత అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న E10 పెట్రోల్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
వివరాలు
E10 మళ్లీ అందుబాటులోకి వస్తుందా?
E10 పెట్రోల్ను త్వరలోనే మళ్లీ తీసుకొచ్చే అవకాశాలపై కేంద్రం పరిశీలన జరుపుతున్నట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ముగ్గురు వ్యక్తులు తెలిపారు.
అయితే E10ను సాధారణ పెట్రోల్గా అందిస్తారా? లేక ఖరీదైన ప్రీమియం ఇంధనంగా విక్రయిస్తారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
పాత వాహనాలకు మరింత అనుకూలమైన E10 ఇంధనాన్ని అందించడం, వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించడం కోసం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
ప్రీమియం ధరకు లభించే ఆక్టేన్ 95ను E10గా విక్రయించడం కూడా పరిశీలనలో ఉన్న ఎంపికల్లో ఒకటని చెప్పారు.
వివరాలు
వినియోగదారుల నుంచి డిమాండ్..
ఇదే సమయంలో ఆక్టేన్ 95ను E10 రూపంలో అందిస్తే దానికి వినియోగదారుల నుంచి ఎంత మేర డిమాండ్ వస్తుంది?
వారు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తారు? అనే అంశాలపైనా ప్రభుత్వం, చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి.
అంటే ఖరీదైన ప్రీమియం E10ను అందించాలా? లేక తక్కువ ధరలో సాధారణ E10ను అందించడమే వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందా? అనే దానిపై చర్చ జరుగుతోంది.
అయితే ఈ చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.