Loading...
GST: జీఎస్టీ కోతల ఎఫెక్ట్.. భారత్‌లో రికార్డు స్థాయిలో ఆటో అమ్మకాలు
జీఎస్టీ కోతల ఎఫెక్ట్.. భారత్‌లో రికార్డు స్థాయిలో ఆటో అమ్మకాలు

GST: జీఎస్టీ కోతల ఎఫెక్ట్.. భారత్‌లో రికార్డు స్థాయిలో ఆటో అమ్మకాలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 07, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో ఆటో మొబైల్ రంగం గత నెలలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు ఏకంగా 25.9 లక్షల యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 26 శాతం వృద్ధి కావడం విశేషం. వస్తు, సేవల పన్ను (GST) రేట్లలో చేసిన కోతల తర్వాత వాహనాల కొనుగోలుపై వినియోగదారుల్లో ఆసక్తి గణనీయంగా పెరగడం ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్‌తో పాటు ట్రాక్టర్ల విక్రయాలు కూడా జూలై నెలలో ఇప్పటివరకు లేని స్థాయిలో నమోదయ్యాయి.

వివరాలు

అన్ని విభాగాల్లోనూ జూలైలో సరికొత్త రికార్డులు..

ఫెడరేషన్ ఆఫ్ ఆటో మొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 28 శాతం పెరిగాయి.

ఇక త్రిచక్ర వాహనాల అమ్మకాలు 16 శాతం, ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 19 శాతం, కమర్షియల్ వాహనాల అమ్మకాలు 24 శాతం మేర వృద్ధి చెందాయి.

FADA వైస్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ మాట్లాడుతూ.. రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుంచి తొలిసారిగా అన్ని వాహన విభాగాలు ఒకేసారి జూలై నెలలో అత్యుత్తమ విక్రయాలను నమోదు చేశాయని తెలిపారు.

వివరాలు

పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలోనే ఎక్కువ డిమాండ్..

వాహనాల కొనుగోళ్లలో గ్రామీణ ప్రాంతాల మార్కెట్లు పట్టణ ప్రాంతాలను మించి మెరుగైన పనితీరు కనబరిచాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు గత నెలలో 29 శాతం పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ వృద్ధి 28 శాతంగా నమోదైంది.

మరోవైపు మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాటా కూడా రికార్డు స్థాయికి చేరింది.

గత ఏడాది ఇదే సమయంలో 7.7 శాతంగా ఉన్న ఈ వాటా.. ఈసారి 11.2 శాతానికి పెరిగింది.

కమర్షియల్ వాహనాల విభాగంలోనూ గ్రామీణ మార్కెట్లు ముందంజలో నిలిచాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహనాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 29 శాతం పెరగగా.. పట్టణ ప్రాంతాల్లో 19 శాతం వృద్ధి నమోదైంది.

ADVERTISEMENT

వివరాలు

గ్రామీణ ప్రాంతాల్లో ప్యాసింజర్ వాహనాలకు భారీ డిమాండ్..

గ్రామీణ ప్రాంతాల్లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 25 శాతం పెరిగాయి. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఈ వృద్ధి 16 శాతంగా ఉంది.

GST తగ్గింపుల తర్వాత వాహనాల ధరలు మరింత అందుబాటులోకి రావడం, కొత్త మోడళ్ల విడుదల, ఆటో మొబైల్ సంస్థలు అందించిన వివిధ మార్కెటింగ్ పథకాలు ప్యాసింజర్ వాహనాల డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయి.

అదే సమయంలో E20 ఇంధన మార్పిడిపై కొంతమంది వినియోగదారుల్లో ఉన్న సందేహాలు కూడా కొనుగోలు ధోరణిని ప్రభావితం చేశాయని FADA తెలిపింది.

దీంతో కొంతమంది కొనుగోలుదారులు CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపారు.

ADVERTISEMENT