Maruti Suzuki: E20 పెట్రోల్ కేసులో మారుతీ సుజుకీకి షాక్.. గ్రాండ్ విటారా మార్చాలన్న ఆదేశాలను సవాల్ చేయనున్న కంపెనీ
ఈ వార్తాకథనం ఏంటి
E20 పెట్రోల్కు సంబంధించిన వివాదంలో వినియోగదారుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయనున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ SUVను కొత్త వాహనంతో మార్చాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో కంపెనీ స్పందించింది. అయితే, ఈ సమస్యకు కారణం వాహనం కాదని, కలుషితమైన ఇంధనమే కారణమని మారుతి సుజుకి వాదిస్తోంది. రాయ్పూర్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఇచ్చిన ఈ తీర్పు, E20 పెట్రోల్కు నేరుగా సంబంధించిన భారత్లోని తొలి వినియోగదారుల కేసుగా భావిస్తున్నారు.
వివరాలు
ఇంధన ట్యాంకు కలుషితం..
ఈ కేసును రాయ్పూర్కు చెందిన డాక్టర్ ప్రేమ్రాజ్ దేవ్తా దాఖలు చేశారు. ఆయన 2024 జూన్లో 2023 జనవరిలో తయారైన గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జీటా+ వేరియంట్ను కొనుగోలు చేశారు.
అయితే, కేవలం ఐదు నెలల్లోనే వాహనం తరచూ మధ్యలో ఆగిపోవడం, పనితీరులో సమస్యలు తలెత్తినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ప్రకారం, ఇంధన ట్యాంకులో కలుషితం ఉన్నట్లు గుర్తించిన అధికారిక సర్వీస్ సెంటర్లు పలుమార్లు ట్యాంక్ను శుభ్రం చేశాయి.
అయినప్పటికీ అదే సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించిన ఇంధన నమూనాలో తెల్లటి పెరుగు మాదిరి పదార్థం కనిపించిందని, దానిని ఎథనాల్గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
పలుమార్లు మరమ్మతులు చేసినప్పటికీ పరిష్కారం కాని సమస్య..
వాహనం E20 పెట్రోల్కు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చనే విషయాన్ని కొనుగోలు సమయంలో తనకు ఎవరూ తెలియజేయలేదని కూడా డాక్టర్ దేవ్తా తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన పత్రాలను పరిశీలించిన రాయ్పూర్ కమిషన్, పలుమార్లు మరమ్మతులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, వాహనంలో అదే లోపాలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడింది.
అంతేకాకుండా, ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ సాధారణంగా అందుబాటులో ఉండటంతో వాహనదారులకు దానినే ఉపయోగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కమిషన్ వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో, 45 రోజుల్లోగా గ్రాండ్ విటారా స్థానంలో కొత్త E20 అనుకూల వాహనాన్ని ఇవ్వాలని లేదా వాహనం ధర, ఆర్టీవో ఫీజులు, ఇన్సూరెన్స్తో మొత్తం రూ.20.50 లక్షలు తిరిగి చెల్లించాలని కమిషన్ మారుతి సుజుకి, డీలర్ను ఆదేశించింది.
వివరాలు
న్యాయ వేదికలో సవాల్ చేస్తామన్న మారుతి సుజుకి..
అదనంగా మానసిక వేధింపులకు పరిహారంగా రూ.1 లక్ష, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.10,000 చెల్లించాలని కూడా ఆదేశించింది.
నిర్ణయించిన గడువులోపు ఈ మొత్తాలను చెల్లించకపోతే వడ్డీ కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
అయితే, కమిషన్ ఇచ్చిన ఆదేశాల ఆధారాన్ని మారుతి సుజుకి తీవ్రంగా వ్యతిరేకించింది.
ఈ కేసులోని వాహనం E20 పెట్రోల్కు పూర్తిగా అనుకూలమైనదేనని, ఆ విషయాన్ని యజమాని మాన్యువల్లో కూడా స్పష్టంగా పేర్కొన్నామని కంపెనీ తెలిపింది.
వినియోగదారుడి వాహనం నుంచి సేకరించిన ఇంధనంలో కలుషితం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని, అలాగే కేసుకు సంబంధించిన మరికొన్ని కీలక అంశాలు కమిషన్ ఉత్తర్వులో ప్రతిబింబించలేదని పేర్కొంది.
చట్టపరమైననిబంధనలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులను ఉన్నత న్యాయ వేదికలో సవాల్ చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది.