LOADING...
BS6 Vehicles: BS6 వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు 3 ఏళ్లకు పెరగొచ్చు.. కేంద్రం కీలక ఆలోచన!
BS6 వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు 3 ఏళ్లకు పెరగొచ్చు.. కేంద్రం కీలక ఆలోచన!

BS6 Vehicles: BS6 వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు 3 ఏళ్లకు పెరగొచ్చు.. కేంద్రం కీలక ఆలోచన!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 25, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

BS-VI (BS6) వాహనాల యజమానులకు త్వరలో ఊరట లభించే అవకాశం ఉంది. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న BS6 వాహనాలకు జారీ చేసే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUCC) గడువును ప్రస్తుతం ఉన్న వ్యవధి కంటే పెంచి మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, కొత్త వాహనాల యజమానులు ప్రతి ఏడాది సర్టిఫికెట్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉండదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ప్రైవేట్ వాహనాలకు సంబంధించిన PUCC నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు

యజమానులపై నిబంధనల భారం..

ఈ ప్రతిపాదన ప్రకారం, ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న BS6 ప్రైవేట్ వాహనాలకు మాత్రం ప్రతి ఏడాది PUCC పునరుద్ధరణ తప్పనిసరిగా కొనసాగుతుంది. ఇక 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్టిఫికెట్‌ను రీన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఎమిషన్ ప్రమాణాలతో వచ్చిన BS6 వాహనాలు పాత మోడళ్లతో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కొత్త వాహనాల యజమానులపై ఉండే నిబంధనల భారం తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

ప్రైవేటు వాహనాలకే నిబంధనలు వర్తింపు..

అయితే ఈ నిబంధనలు కేవలం BS6 ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తించనున్నాయి. మరోవైపు, ఆరు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న BS6 వాణిజ్య వాహనాలకు PUCC గడువు రెండు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాణిజ్య వాహనాల విషయంలో మాత్రం ప్రైవేట్ వాహనాలకు వర్తించే నిబంధనలే అమలులో ఉండనున్నాయి. కాలుష్య ధృవీకరణ వ్యవస్థలో సమగ్ర మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. BS6 వాహనాల తక్కువ కాలుష్య ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే సమయంలో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే పాత వాహనాల వినియోగాన్ని నిరుత్సాహపరచడమే లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు

పరీక్షా విధానం మరింత కఠినతరం..

అంతేకాకుండా, పరీక్షల సమయంలో తప్పుడు రీడింగ్స్ నమోదు కాకుండా ఉండేందుకు పరీక్షా విధానాన్ని మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీని కూడా తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విధానంలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, పాత వాహనాలను క్రమంగా రోడ్లపై నుంచి తొలగించేందుకు స్క్రాపేజ్ బోనస్‌ను అందించే అవకాశమున్నట్లు సమాచారం. కొత్త వాహనాల కొనుగోలును ప్రోత్సహించడం కూడా ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంటున్నారు.

Advertisement