Vehicle insurance: E20 ఫ్యూయల్ వాడుతున్నారా? ఇన్సూరెన్స్పై కేంద్రం కీలక ప్రకటన..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహన బీమా (ఇన్సూరెన్స్) చెల్లుబాటు రద్దవుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. E20 ఇంధనం ఉపయోగించినా వాహన బీమాపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, E20 ఇంధన వినియోగాన్ని బీమా చెల్లుబాటుతో అనుసంధానిస్తూ వస్తున్న ఆందోళనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన విధానమని, అమెరికా, బ్రెజిల్, జపాన్ వంటి అనేక దేశాల్లో ఇది విజయవంతంగా అమలవుతోందని వెల్లడించింది.
వివరాలు
వ్యవసాయ ముడి పదార్థాలకు డిమాండ్..
ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం వల్ల దేశానికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు లభించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముడి చమురు దిగుమతులు తగ్గడం వల్ల విదేశీ మారక ద్రవ్యంగా రూ.1.4 లక్షల కోట్లకు పైగా ఆదా చేయగలిగామని పేర్కొంది. అలాగే ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన వ్యవసాయ ముడి పదార్థాలకు స్థిరమైన డిమాండ్ ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరగడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతోందని వెల్లడించింది.
వివరాలు
ఇథనాల్ మిశ్రమ విధానం కీలక పాత్ర..
ఇథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని సురక్షితంగా, పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా అమలు చేయడంపై ప్రభుత్వం తన కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటించింది. ఈ కార్యక్రమం అమలులో శాస్త్రీయ ఆధారాలు, సంబంధిత వర్గాలతో నిరంతర సంప్రదింపులనే మార్గదర్శకంగా తీసుకుంటామని తెలిపింది. పరిశుభ్రమైన రవాణా వ్యవస్థ, ఇంధన భద్రత సాధన దిశగా భారత్ చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఇథనాల్ మిశ్రమ విధానం కీలక పాత్ర పోషిస్తుందని వివరించింది.