Current Account Deficit: జూన్లో కరెంట్ ఖాతా లోటు రూ.6.2 బిలియన్ డాలర్లు.. ఆర్బీఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ కరెంట్ ఖాతా లోటు (Current Account Deficit) జూన్ 2026లో 6.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. గతేడాది జూన్లో 1.2 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కరెంట్ ఖాతా లోటు పెరగడానికి ప్రధాన కారణం వాణిజ్య లోటు విస్తరించడం, జూన్ 2025లో 19.2 బిలియన్ డాలర్లుగా ఉన్న వస్తు వాణిజ్య లోటు.. జూన్ 2026లో 30.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.
వివరాలు
దిగుమతులు భారీగా పెరుగుదల
జూన్లో భారత్ వస్తు ఎగుమతులు 35.3 బిలియన్ డాలర్ల నుంచి 41.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే దిగుమతులు మరింత వేగంగా పెరిగాయి.
గతేడాది జూన్లో 54.5 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. ఈ ఏడాది జూన్లో 71.4 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఇదే సమయంలో సేవల రంగంలో మిగులు 16.2 బిలియన్ డాలర్ల నుంచి 17.9 బిలియన్ డాలర్లకు పెరిగింది.
సేవల ఎగుమతులు 32.1 బిలియన్ డాలర్ల నుంచి 36.4 బిలియన్ డాలర్లకు పెరగగా.. దిగుమతులు 15.9 బిలియన్ డాలర్ల నుంచి 18.5 బిలియన్ డాలర్లకు చేరాయి.
నికర బదిలీలు (Net Transfers) కూడా 10.9 బిలియన్ డాలర్ల నుంచి 11.9 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
వివరాలు
క్యాపిటల్ ఖాతాలోకి నిధుల ప్రవాహం
మరోవైపు నికర ఆదాయ లోటు 6.8 బిలియన్ డాలర్ల నుంచి 5.8 బిలియన్ డాలర్లకు తగ్గింది.
క్యాపిటల్ ఖాతా విషయానికి వస్తే.. జూన్ 2026లో 9.1 బిలియన్ డాలర్ల నికర నిధుల ప్రవాహం నమోదైంది.
గతేడాది ఇదే నెలలో 1.6 బిలియన్ డాలర్ల నిధుల బయటకు ప్రవాహం కనిపించింది.
జూన్లో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 1.3 బిలియన్ డాలర్లు కాగా.. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (FPI) 2.5 బిలియన్ డాలర్ల నికర ప్రవాహాన్ని నమోదు చేశాయి.
దీంతో జూన్ 2026లో దేశ మొత్తం బ్యాలెన్స్ 2.9 బిలియన్ డాలర్ల మిగులుగా ఉంది. గతేడాది జూన్లో ఇది 0.4 బిలియన్ డాలర్ల లోటుగా నమోదైంది.
వివరాలు
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ లోటు
2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వస్తు వాణిజ్య లోటు 68.9 బిలియన్ డాలర్ల నుంచి 85.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఇదే సమయంలో సేవల మిగులు 47.9 బిలియన్ డాలర్ల నుంచి 52.2 బిలియన్ డాలర్లకు చేరింది.
ఈ త్రైమాసికంలో నికర బదిలీలు కూడా 30.9 బిలియన్ డాలర్ల నుంచి 41.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ మొత్తం బ్యాలెన్స్ 8.1 బిలియన్ డాలర్ల లోటులో ఉంది. 2025 ఏప్రిల్-జూన్లో 4.5 బిలియన్ డాలర్ల మిగులు నమోదైనట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి.