Loading...
8th Pay Commission: పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యమేనా? 8వ పే కమిషన్‌లో కీలక చర్చలు
పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యమేనా? 8వ పే కమిషన్‌లో కీలక చర్చలు

8th Pay Commission: పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యమేనా? 8వ పే కమిషన్‌లో కీలక చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల వేతనాలు,పెన్షన్‌లలో మార్పులు చేసేందుకు ఏర్పాటైన 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ముందు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఉంచుతున్నాయి. వీటిలో ప్రధానంగా రద్దు చేసిన పాత పెన్షన్ విధానాన్ని(OPS) తిరిగి అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో పింఛనర్ల సంఘాల ప్రతినిధులు ఈ అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. చెన్నై జీపీఓ పింఛనర్ల ఫోరమ్‌తో పాటు మరికొన్ని సంఘాలు తమ డిమాండ్లతో కూడిన జాబితాను 8వ పే కమిషన్‌కు అందజేశాయి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం,పింఛన్‌,కుటుంబ పింఛన్ మొత్తాలను గణనీయంగా పెంచడం,పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ నిబంధనలను మరింత సరళంగా మార్చడం వంటి అంశాలను అందులో ప్రస్తావించారు.

వివరాలు 

ఎంఏసీపీ ప్రయోజనాల్లో మార్పులు కోరిన ఉద్యోగ సంఘాలు

అలవెన్సులు, సెలవులకు సంబంధించిన నిబంధనలను మెరుగుపరచడంతో పాటు ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలని సంఘాలు కోరాయి.

అలాగే, ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సవరణ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా శాశ్వత వేతన సవరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.

కనీస నెలవారీ వేతనాన్ని రూ.68,000గా నిర్ణయించాలని కూడా ప్రతిపాదించాయి.

'మోడిఫైడ్ అష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెషన్' (MACP) కింద లభించే ప్రయోజనాలను కూడా సవరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

ఉద్యోగుల కెరియర్ పురోగతి, అలవెన్సులు, సెలవులు, సామాజిక భద్రత వంటి అంశాల్లో మెరుగైన ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.

వివరాలు 

2027లో నివేదిక వచ్చే అవకాశం

జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన 2025 నవంబర్‌లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు.

కమిషన్ తన నివేదికను ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.

ఈ లెక్కన 2027 మే-జూన్ నాటికి నివేదిక అందే అవకాశం ఉంది. ప్రస్తుతం కమిషన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇందులో భాగంగా సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు చండీగఢ్‌లో తదుపరి సమావేశాలు నిర్వహించనుంది.

ఈ సమావేశాల్లో ఉద్యోగులు, పింఛనర్లు తమకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లను కమిషన్ ముందు ఉంచనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అమలులో న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం

ఉద్యోగులు, పింఛనర్లు కోరుతున్న ప్రతి అంశాన్ని అమలు చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరణతో పాటు ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాల్లో మార్పులు చేయడంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ న్యాయ నిపుణురాలు, సీఎంఎస్ ఇండస్‌లా పార్టనర్ అమృతా టోంక్ ఈ అంశంపై స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు.

ఉద్యోగులు తమ సర్వీసులో ఇప్పటికే అందించిన సేవలకు ప్రతిఫలంగా పెన్షన్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

'వన్ ర్యాంక్.. వన్ పెన్షన్'పైనా అభ్యంతరాలు

అందువల్ల 2026కు ముందు పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఇప్పటికే వర్తిస్తున్న ప్రయోజనాలను తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేయడం చట్టపరంగా నిలబడకపోవచ్చని వివరించారు.

విధానాల్లో మార్పులు చేయాల్సి వస్తే వాటిని భవిష్యత్తులో నియమితులయ్యే ఉద్యోగులకు వర్తింపజేయడం మరింత సముచితమైన విధానంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

సివిల్ సర్వీస్ ఉద్యోగులకు కూడా'వన్ ర్యాంక్, వన్ పెన్షన్'విధానాన్ని విస్తరించాలన్న డిమాండ్‌పై కూడా న్యాయనిపుణురాలు కొన్ని ఆందోళనలు వ్యక్తం చేశారు.

దీనివల్ల కొత్త రకమైన అసమానతలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

వివిధ ప్రభుత్వ శాఖలు,కేడర్లలో ఉద్యోగుల నిర్మాణం,బాధ్యతలు,కెరియర్ పురోగతి విధానాల్లో గణనీయమైన తేడాలు ఉంటాయని ఆమె గుర్తుచేశారు.

ఈ వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే రకమైన పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తే భవిష్యత్తులో వివాదాలకు అవకాశం ఉంటుందని సూచించారు.

వివరాలు 

భవిష్యత్తుకు వర్తించే డిమాండ్ల అమలు సులభం

మరోవైపు వార్షిక ఇంక్రిమెంట్ల పెంపు వంటి డిమాండ్లను అమలు చేయడం కొంత సులభంగా ఉంటుందని అమృతా టోంక్ పేర్కొన్నారు.

ఇలాంటి మార్పులు ప్రధానంగా భవిష్యత్తులో వర్తించేలా చేయవచ్చని, అందువల్ల ఇప్పటికే పొందుతున్న ప్రయోజనాలను వెనక్కి తీసుకునే సమస్య తక్కువగా ఉంటుందని వివరించారు.

వివరాలు 

రాష్ట్రాల్లోనూ ప్రభావం

కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సులు చేసిన తర్వాత వాటిని దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా యథాతథంగా అమలు చేసే పరిస్థితి ఉంది.

దీంతో కేంద్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులు,పింఛనర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ముందుగానే స్పష్టమైన కట్‌ఆఫ్ తేదీలను నిర్ణయించాలని,కొత్త విధానం నుంచి పాత విధానానికి మారే సమయంలో పాటించాల్సిన పరివర్తన నిబంధనలను స్పష్టంగా ప్రకటించాలని అమృతా టోంక్ సూచించారు.

ఈ నేపథ్యంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, కనీస వేతనం పెంపు,పింఛన్‌-కుటుంబ పింఛన్‌లో మార్పులు,MACP ప్రయోజనాల సవరణ,ఉద్యోగుల సామాజిక భద్రత వంటి అంశాలపై 8వ పే కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తుందన్న దానిపై కేంద్ర ఉద్యోగులు,పింఛనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT