8th Pay Commission : 8వ వేతన సంఘం వెబ్సైట్ ప్రారంభం.. జీతాలు, పెన్షన్లపై ఉద్యోగుల సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Central Pay Commission) ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. తాజాగా ఈ కమిషన్ తన 'అధికారిక వెబ్సైట్ 8cpc.gov.in'ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉద్యోగులు, ఇతర స్టేక్హోల్డర్ల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటికే నవంబర్ 3, 2025న ఆర్థిక శాఖ 8వ వేతన సంఘాన్ని అధికారికంగా నోటిఫై చేసింది. ఇప్పుడు ఈ ప్రక్రియలో భాగంగా సాధారణ కేంద్ర ఉద్యోగులు కూడా తమ జీతాలు, పెన్షన్లపై అభిప్రాయాలు వెల్లడించే అవకాశం లభించడం విశేషంగా మారింది.
Details
ఎవరు సూచనలు పంపవచ్చు?
ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం అందరికీ ఓపెన్గా ఉంచింది. కింది వర్గాల వారు తమ సూచనలు సమర్పించవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీలు) సిబ్బంది పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది రెగ్యులేటరీ సంస్థల సభ్యులు పరిశోధకులు, విద్యావేత్తలు, ఆసక్తి కలిగిన వ్యక్తులు
Details
18 ప్రశ్నలతో ప్రశ్నావళి
8వ వేతన సంఘం సమగ్ర, వాస్తవిక సిఫార్సులు చేయడానికి వీలుగా MyGov పోర్టల్లో 18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని వేతన సవరణ ఎలా ఉండాలి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతగా ఉండాలి? వార్షిక ఇంక్రిమెంట్లు, అలవెన్సుల విధానంలో మార్పులు అవసరమా? ఉన్నత స్థాయి అధికారుల జీతాల నిర్ణయంలో పాటించాల్సిన ప్రమాణాలు ఏమిటి? వంటి కీలక అంశాలపై అభిప్రాయాలను కోరుతున్నారు. అలాగే సమాధానాలు ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Details
8వ వేతన సంఘానికి సూచనలు పంపే విధానం
స్టెప్ 1: MyGov ప్రశ్నావళి లింక్ను సందర్శించాలి ([https://www.mygov.in/mygov-survey/8th-central-pay-commission-questionnaire/](https://www.mygov.in/mygov-survey/8th-central-pay-commission-questionnaire/)) స్టెప్ 2: మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి స్టెప్ 3: వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి స్టెప్ 4: అడిగిన 18 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి గమనిక: MyGov పోర్టల్ ద్వారా పంపిన ఆన్లైన్ దరఖాస్తులనే మాత్రమే కమిషన్ స్వీకరిస్తుంది. ఈమెయిల్స్, పీడీఎఫ్ ఫైళ్లు లేదా ఫిజికల్ లెటర్లను పరిగణనలోకి తీసుకోరు.
Details
8వ వేతన సంఘం అమలు ఎప్పటి నుంచి?
8వ వేతన సంఘానికి తన నివేదికను సమర్పించేందుకు 18 నెలల గడువు ఉంది. అయితే, వేతన సవరణలు, బకాయిలు మాత్రం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కమిషన్ అమలులోకి వస్తే సుమారు 45 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు భారీ ప్రయోజనం పొందే అవకాశముంది.