Page Loader
Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు
Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్..

Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2025
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రభుత్వం పాక్‌పై తీసుకున్న కఠిన చర్యలు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గురువారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే మార్కెట్ సూచీలు గణనీయంగా పడిపోయాయి. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (KSE-100) బెంచ్ మార్క్ సూచీ ఏకంగా 2.12 శాతం క్షీణించింది. అంటే 2,485 పాయింట్లు తగ్గి 114,740.29 స్థాయికి పడిపోయింది. భౌగోళిక స్థితిగతులపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల ఈ పతనం చోటుచేసుకుంది. మార్కెట్ ప్రారంభమైన మొదటి 5 నిమిషాల్లోనే ఈ స్థాయిలో నష్టాన్ని నమోదు చేసింది.

వివరాలు 

పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సింధు జలాల పంపకాన్ని నిలిపివేయడంతో పాటు, పాకిస్తాన్‌కు చెందిన దౌత్యవేత్తలను దేశం నుంచి వెళ్లగొట్టింది. అంతేకాకుండా పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. వాఘా-అటారీ సరిహద్దును కూడా తాత్కాలికంగా మూసివేసింది. ఈ వరుస చర్యల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది.

వివరాలు 

కాశ్మీర్‌ మొత్తం బంద్‌

ఇదిలా ఉండగా, మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల దేహాలను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు. ఈ ఘటనతో జమ్మూకాశ్మీర్‌ ప్రాంతం నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వెనుదిరుగుతున్నారు. ఈ దాడికి నిరసనగా గురువారం కాశ్మీర్‌ మొత్తం బంద్‌కు పిలుపునిచ్చింది. చిక్కుకున్న పర్యాటకుల కోసం స్థానిక హోటళ్లు ముందుకొచ్చి 15 రోజులు ఉచితంగా బస కల్పిస్తామని ప్రకటించాయి.