LOADING...
Anil Ambani: అనిల్‌ అంబానీకి మరో షాక్‌.. 13 బ్యాంకులకు ఈడీ నోటీసులు!
అనిల్‌ అంబానీకి మరో షాక్‌.. 13 బ్యాంకులకు ఈడీ నోటీసులు!

Anil Ambani: అనిల్‌ అంబానీకి మరో షాక్‌.. 13 బ్యాంకులకు ఈడీ నోటీసులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయెన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఇప్పటికే ఆయనపై విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తాజాగా మరో కీలక అడుగు వేసింది. అనిల్‌ అంబానీకి చెందిన సంస్థలకు అప్పులిచ్చిన పలు బ్యాంకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మొత్తం 12 నుంచి 13 బ్యాంకులకు ఈ నోటీసులు పంపినట్లు సమాచారం. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ బ్యాంకులు రిలయన్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లాంటి కంపెనీలకు భారీగా రుణాలు ఇచ్చాయి.

Details

బ్యాంకు అధికారులకు నోటిసులు

ఈడీ నోటీసులు అందుకున్న బ్యాంకుల జాబితాలో ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సింద్‌ బ్యాంక్‌ వంటి ప్రముఖ సంస్థలున్నాయి. ఈ బ్యాంకులు అందించిన రుణాల వివరాలు, వాటికి సంబంధించిన దస్తావేజులు, లోన్ క్లియరెన్స్ ప్రక్రియపై సమాచారం కోరుతూ ఈడీ అడిగినట్లు తెలుస్తోంది. అప్పుల్లో భాగంగా ఆర్ధిక దోపిడీ జరిగినట్టుగా అనుమానంతో కొన్ని కేసుల్లో బ్యాంకు అధికారులకూ నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో అనిల్‌ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న పార్థసారధి బిస్వాల్‌ను అరెస్టు చేశారు. ఆయన బిస్వాల్‌ ట్రేడ్ లింక్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Details

రూ.3వేల కోట్లకు సంబంధించి విచారణ

రిలయన్స్ పవర్‌కు రూ.68.2 కోట్ల రుణాన్ని పొందేందుకు తప్పుడు హామీ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలపై అతనిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో యస్‌ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలకు 2017-2019 మధ్యకాలంలో జారీ చేసిన రూ.3,000 కోట్ల రుణానికి సంబంధించి ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఇటీవలి పరిణామాల్లో ఈడీ జూలై 5న అనిల్‌ అంబానీకి సమన్లు జారీ చేసింది. దర్యాప్తులో సహకరించేందుకు దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. ఆయన విదేశాలకు పారిపోకుండా చూసేందుకు లుక్‌అవుట్ సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. విచారణ సమయంలో పీఎంఎల్‌ఏ కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

Details

35 ప్రాంతాల్లో సోదాలు

రిలయన్స్‌ గ్రూప్‌లోని మరికొంతమంది ఉన్నతాధికారులకు కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇది అంతా ఒక పెద్ద దర్యాప్తు వ్యవస్థ భాగంగా కొనసాగుతోంది. జులై 24 నుంచి మూడు రోజుల పాటు ఈడీ 50కి పైగా అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీలపై దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో సోదాలు చేసి 25 మందిపై దృష్టిసారించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా సహా అనేక సంస్థలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్టు ఈడీకి లభించిన సమాచారం ఆధారంగా ఈ దర్యాప్తు జరుగుతోంది.