Page Loader
Trump tariff on India: ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న  భారత్‌..!
ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న భారత్‌..!

Trump tariff on India: ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న  భారత్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలను ప్రకటించారు. భారతదేశంపై 26% టారిఫ్‌లు విధిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ ఇప్పటికే విశ్లేషణ ప్రారంభించింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలియజేశారు. అయితే, ఈ సుంకాలను భారత్‌కు ఎదురుదెబ్బగా భావించడం లేదని పేర్కొన్నారు.

వివరాలు 

భారతదేశంపై ప్రభావం 

"ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్‌ల ప్రభావం మన దేశంపై ఎంతవరకు ఉండొచ్చో వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. అయితే, ఇక్కడ ఒక పరిష్కార మార్గం ఉంది. అమెరికా వ్యక్తీకరించిన ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే, ఆ దేశంపై సుంకాలను తగ్గించేందుకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది. అందువల్ల ఇది మిశ్రమ ఫలితంగా భావించాలి తప్ప, భారత్‌కు తీవ్ర ఎదురుదెబ్బ కాదు" అని సదరు అధికారి వివరించారు.

వివరాలు 

సుంకాల అమలు 

ట్రంప్‌ ప్రకటించిన 26% టారిఫ్‌లో, 10% సుంకం ఏప్రిల్‌ 5నుంచి అమల్లోకి వస్తుందని, మిగిలిన 16% ఏప్రిల్‌ 10 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. సుంకాల ప్రకటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. మోదీ తనకు మంచి స్నేహితుడని, అయితే భారత్‌ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు. భారత్‌ 52% సుంకాలను విధిస్తోందని, అందుకే తాము 26% టారిఫ్‌ విధిస్తున్నామని వెల్లడించారు.

వివరాలు 

ప్రకటన వివరాలు 

భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు) వాషింగ్టన్‌ డీసీలో ట్రంప్‌ ఈ టారిఫ్‌ ప్రకటన చేశారు. ఈ రోజును 'లిబరేషన్‌ డే'గా ప్రకటించిన ఆయన, అన్ని దేశాలూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించవచ్చని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాక, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై, ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, తాము 26% సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు.