India Tariffs on steel: చైనా ఉక్కుపై భారత సుంకాలు: మూడేళ్లపాటు అమలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉక్కు ఉత్పత్తులపై నియంత్రణ సాధించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి వచ్చే కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులపై 12 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ సుంకాలు మూడేళ్లపాటు అమల్లో ఉంటాయి, అని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది. నోటిఫికేషన్ ప్రకారం, మొదటి సంవత్సరంలో సుంకం 12 శాతంగా, రెండో సంవత్సరంలో 11.5 శాతంగా, మూడో సంవత్సరంలో 11 శాతంగా అమలులో ఉంటుందని పేర్కొంది. ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారులలో భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ, చైనా నుండి తక్కువ ధరల ఉక్కు దిగుమతులు పెరగడం కారణంగా దేశీయ పరిశ్రమలకు నష్టాలు తలెత్తుతున్నాయి.
వివరాలు
విదేశాల నుంచి వచ్చే అన్ని ఉక్కు ఉత్పత్తులపై తాత్కాలికంగా 12శాతం సుంకం
ఈ సమస్యను పరిష్కరించడానికి, చైనా,వియత్నాం,నేపాల్ వంటి దేశాల నుండి వచ్చే ఉక్కు ఉత్పత్తులపై ఈ సుంకాలు వర్తిస్తాయి. స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక రకాల ఉక్కుపై కూడా ఈ విధానం అమలు అవుతుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (DGTR) తెలిపినట్లుగా,ఇటీవల ఉక్కు దిగుమతులు గణనీయంగా పెరగడం వల్ల దేశీయ పరిశ్రమలకు తీవ్రమైన నష్టాలు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో,మూడేళ్లపాటు సుంకాలు విధించడానికి సిఫార్సు చేసింది. నోటిఫికేషన్ ప్రకారం,ఇదే కారణంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉండగా,ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ విదేశాల నుంచి వచ్చే అన్ని ఉక్కు ఉత్పత్తులపై తాత్కాలికంగా 12శాతం సుంకం విధించిందని కూడా గుర్తించవలసి ఉంది. ఈ సుంకాలు 200రోజులపాటు అమల్లో ఉండగా,గత నెలలో ముగిసినట్లు తెలుస్తోంది.