Hurun India: అంబానీ నుంచి అదానీ వరకు.. 400 వ్యాపార కుటుంబాల సంపద రూ.215 లక్షల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అత్యంత విలువైన 300 వ్యాపార కుటుంబాల సంపద గత రెండేళ్లలో భారీగా పెరిగింది. ఈ కుటుంబాలకు చెందిన వ్యాపార సంస్థలు రోజుకు సగటున రూ.4,076 కోట్ల చొప్పున ఆర్జిస్తున్నాయి. రెండేళ్ల వ్యవధిలో వీటి సంపదకు దాదాపు రూ.30లక్షల కోట్లు అదనంగా చేరాయి. దీంతో 300 కుటుంబాల మొత్తం సంపద రూ.138 లక్షల కోట్లకు చేరింది. అంటే 1.46 లక్షల కోట్ల డాలర్లకు సమానం. '2026 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్ లిస్ట్' ఈ వివరాలను వెల్లడించింది. నెదర్లాండ్స్,సౌదీ అరేబియా,స్విట్జర్లాండ్,పోలండ్ వంటి దేశాల జీడీపీ కంటే ఈ కుటుంబాల మొత్తం సంపదే ఎక్కువగా ఉండటం గమనార్హం.
వివరాలు
10 కుటుంబాల చేతుల్లోనే 51 శాతం సంపద
2024 నుంచి ఇప్పటివరకు నిఫ్టీ-50 సూచీ 1.1 శాతం, సెన్సెక్స్ 3.7 శాతం నష్టపోయినప్పటికీ.. ఈ కుటుంబాల సంపద మాత్రం 27.5 శాతం పెరిగింది.
సంపద పరంగా ముకేష్ అంబానీ కుటుంబం అగ్రస్థానంలో కొనసాగుతోంది.
గత ఏడాది కాలంలో ఆ కుటుంబ సంపద 8.5 శాతం తగ్గినప్పటికీ.. రూ.25.82 లక్షల కోట్ల సంపదతో తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది.
రెండో స్థానంలో ఉన్న కుమార్ మంగళం బిర్లా కుటుంబ సంపద రూ.8.14 లక్షల కోట్లు.దీంతో బిర్లా కుటుంబంతో పోలిస్తే అంబానీ కుటుంబ సంపద దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
అగ్ర 10 వ్యాపార కుటుంబాల వద్ద ఉన్న సంపద.. మొత్తం 300 కుటుంబాల సంపదలో 51 శాతానికి సమానం.
వివరాలు
54 లక్షల మందికి ఉద్యోగాలు
ఈ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే కనీసం రూ.1,300 కోట్ల సంపద ఉండాలి.
టాప్-200లో స్థానం పొందిన కుటుంబాల కనీస సంపద రూ.5,000 కోట్లుగా ఉంది. ఇక టాప్-50లోకి రావాలంటే కనీసం రూ.52,100 కోట్ల సంపద ఉండాల్సిందే.
100 కోట్ల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగిన కుటుంబాల సంఖ్య ఏడాదిలో 48 శాతం పెరిగింది. దీంతో అలాంటి కుటుంబాల సంఖ్య 230కి చేరింది.
ఈ 300 వ్యాపార కుటుంబాలకు చెందిన సంస్థలు కలిపి 54 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవి మొత్తం రూ.56 లక్షల కోట్ల ఆదాయాన్ని, రూ.5.6 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.
పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.1.9 లక్షల కోట్లు చెల్లించాయి.
వివరాలు
తొలితరం కుటుంబ వ్యాపారాల్లో అదానీ అగ్రస్థానం
దేశంలో వసూలయ్యే మొత్తం కార్పొరేట్ పన్నులో ఇది దాదాపు 17 శాతానికి సమానం.
ఈ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ కుటుంబం 24వ స్థానంలో నిలిచింది. ఆ కుటుంబం మొత్తం సంపద విలువ రూ.1,13,300 కోట్లుగా ఉంది.
ఈ ఏడాది తొలి తరం కుటుంబ వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేకంగా 100 కుటుంబాలతో మరో జాబితాను రూపొందించారు.
ఈ కుటుంబాల మొత్తం సంపద రూ.77.8 లక్షల కోట్లుగా ఉంది.
రెండు జాబితాలను కలిపి చూస్తే.. దేశంలోని 400 కుటుంబాల మొత్తం సంపద రూ.215.8 లక్షల కోట్లకు చేరుతుంది.
తొలితరం కుటుంబ వ్యాపారాల విభాగంలో గౌతమ్ అదానీ కుటుంబం రూ.19.6 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో ఉంది.
వివరాలు
హైదరాబాద్లో పెరుగుతున్న కొత్త తరం వ్యాపారాలు
సునీల్ భారతీ మిత్తల్ కుటుంబం రూ.12.1లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది.
దిలీప్ సంఘ్వి కుటుంబం రూ.4.55లక్షల కోట్లు, పూనావాలా కుటుంబం రూ.2.98 లక్షల కోట్లు, దమానీ కుటుంబం రూ.2.86 లక్షల కోట్ల సంపదతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అత్యధిక సంపద కలిగిన వ్యాపార కుటుంబాల కార్యాలయాలు ముంబయిలో ఎక్కువగా ఉన్నాయి.
అక్కడ మొత్తం 95 కార్యాలయాలు ఉన్నాయి. దిల్లీలో 58,కోల్కతాలో 26కార్యాలయాలు ఉన్నాయి.
హైదరాబాద్లో ఇప్పటికే దిగ్గజ కంపెనీలకు చెందిన 9సంస్థలు ఉండగా.. తొలి తరం కుటుంబ వ్యాపారాలకు చెందిన 15 సంస్థలు ఉన్నాయి.
కొత్త తరం వ్యాపారాల విలువ నగరంలో క్రమంగా పెరుగుతోందనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది. తొలి తరం సంస్థల సంఖ్య ముంబయిలో 24,దిల్లీలో 18గా ఉంది.
వివరాలు
వ్యాపార రంగంలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం
వ్యాపార సంస్థల నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉన్నప్పటికీ.. క్రమంగా వారి ప్రాతినిధ్యం పెరుగుతోంది.
ఈ జాబితాలోని 18 కంపెనీల నిర్వహణ బాధ్యతలు మహిళల చేతుల్లో ఉన్నాయి.
మహిళల నాయకత్వంలో ఉన్న అత్యంత విలువైన సంస్థగా హిందుస్థాన్ జింక్ నిలిచింది.
ప్రియా అగర్వాల్ హెబ్బర్ నేతృత్వంలోని ఈ సంస్థ విలువ రూ.4.45 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో హెచ్సీఎల్ టెక్ ఉంది.
రోష్ని నాడార్ నేతృత్వంలోని ఈ సంస్థ విలువ రూ.2.91 లక్షల కోట్లు.
తొలితరం కుటుంబ వ్యాపారాల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ ఫల్గుణి నాయర్. నైకా వ్యవస్థాపకురాలైన ఆమె కుటుంబ సంపద రూ.89,100 కోట్లుగా ఉంది.