Loading...
India's Private Sector: ఆగస్టులో 54.6కు చేరిన భారత్‌ ప్రైవేట్‌ రంగ పీఎంఐ

India's Private Sector: ఆగస్టులో 54.6కు చేరిన భారత్‌ ప్రైవేట్‌ రంగ పీఎంఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో ప్రైవేట్‌ రంగ కార్యకలాపాలు ఆగస్టులో స్వల్పంగా పుంజుకున్నాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హెచ్‌ఎస్‌బీసీ ఫ్లాష్‌ ఇండియా కాంపోజిట్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (PMI) ఆగస్టులో 54.6కు పెరిగింది. జులైలో ఇది 52 నెలల కనిష్ఠ స్థాయి అయిన 54.3గా నమోదైంది. రాయిటర్స్‌ పోల్‌లో నిపుణులు అంచనా వేసిన 54.3 కంటే తాజా గణాంకం స్వల్పంగా ఎక్కువగా ఉంది. పీఎంఐ 50 కంటే పైన ఉండటం వల్ల దేశ ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి బాటలోనే ఉన్నాయని సూచిస్తోంది. 50 కంటే ఎక్కువ స్కోరు వృద్ధిని, 50 కంటే తక్కువ స్కోరు క్షీణతను సూచిస్తుంది.

వివరాలు 

సేవల రంగం పుంజుకోవడంతో వృద్ధి

సేవల రంగం పుంజుకోవడంతోనే ప్రైవేట్‌ రంగ కార్యకలాపాల్లో ఈ మెరుగుదల ప్రధానంగా కనిపించింది.

ఆగస్టులో సేవల రంగ పీఎంఐ 54.5కు చేరింది. జులైలో ఇది 53 నెలల కనిష్ఠ స్థాయి అయిన 53.3గా ఉంది.

దీంతో సేవల రంగంలో కార్యకలాపాలు కొంత వేగం పుంజుకున్నాయి. అయితే తయారీ రంగానికి మాత్రం పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు.

తయారీ పీఎంఐ వరుసగా మూడో నెలలోనూ తగ్గింది. జులైలో 53.5గా ఉన్న ఈ సూచీ ఆగస్టులో 52.9కు పడిపోయింది.

ఇది 2021 ఆగస్టు తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. తయారీ రంగంలో వస్తువుల ఉత్పత్తి, కొత్త ఆర్డర్ల వృద్ధి రెండూ ఐదేళ్లలోనే అత్యంత నెమ్మదిగా నమోదయ్యాయి.

వివరాలు 

తయారీ రంగానికి ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు

మారుతున్న మార్కెట్‌ పరిస్థితులు, పెరుగుతున్న పోటీ కారణంగా తయారీ సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

తయారీ రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా రెండున్నరేళ్లలో తొలిసారిగా తగ్గింది.

అయితే మొత్తం ప్రైవేట్‌ రంగంలో ఉపాధికల్పన మాత్రం వేగం పుంజుకుంది.

ముఖ్యంగా సేవల రంగంలో నియామకాలు 15నెలల గరిష్ఠ స్థాయికి చేరడంతో..మొత్తం ఉద్యోగ కల్పన 2025 జూన్‌ తర్వాత అత్యంత వేగంగా నమోదైన స్థాయికి చేరింది.

ఇదిలా ఉండగా..సంస్థలపై ముడి పదార్థాలు,ఇతర ఇన్‌పుట్‌ ఖర్చుల ఒత్తిడి ఏడు నెలల కనిష్ఠానికి తగ్గింది.

అయితే పెరిగిన వ్యయాలను వినియోగదారులపైకి బదిలీ చేసేందుకు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి.

ఏప్రిల్‌ తర్వాత విక్రయ ధరలు అత్యంత వేగంగా పెరిగినట్లు తాజా పీఎంఐ గణాంకాలు వెల్లడించాయి.

ADVERTISEMENT