Loading...
Rajamahendravaram: హౌస్‌బోటులో గోదారి అందాలు.. రాజమహేంద్రవరంలో త్వరలో పర్యాటకులకు కొత్త అనుభవం
హౌస్‌బోటులో గోదారి అందాలు.. రాజమహేంద్రవరంలో త్వరలో పర్యాటకులకు కొత్త అనుభవం

Rajamahendravaram: హౌస్‌బోటులో గోదారి అందాలు.. రాజమహేంద్రవరంలో త్వరలో పర్యాటకులకు కొత్త అనుభవం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

గోదావరి నదిలో విహరించాలనుకునే పర్యాటకులకు రాజమహేంద్రవరం మరో కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటివరకు బోటులో కొద్దిసేపు ప్రయాణిస్తూ నదీ అందాలను ఆస్వాదించే అవకాశం మాత్రమే ఉండేది. అయితే కేరళలో కనిపించే తరహాలో హౌస్‌బోటులో రోజంతా గడిపే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం విజయవాడలో ఒకటి, కోనసీమలోని దిండి ప్రాంతంలో రెండు హౌస్‌బోట్లు ఉన్నాయి. వీటి తరహాలోనే రాజమహేంద్రవరంలోనూ మరో హౌస్‌బోటు పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.

వివరాలు 

సరస్వతీ ఘాట్‌కు చేరిన హౌస్‌బోటు

రాజమహేంద్రవరంలోని సరస్వతీ ఘాట్‌ వద్దకు క్యాప్సూల్‌ ఆకారంలో రూపొందించిన అత్యాధునిక హౌస్‌బోటు చేరింది.

ఇందులో గరిష్ఠంగా 15 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రారంభంలో కేవలం ఎనిమిది మందిని మాత్రమే అనుమతించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

బోటులో బస చేసే వారికి అవసరమైన పలు సదుపాయాలను ఏర్పాటు చేశారు. మంచం, చిన్న ఫ్రిజ్‌, టీవీ, ఏసీతో పాటు బాత్రూం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

వివరాలు 

అద్దాల గుండా ప్రకృతి అందాలు

హౌస్‌బోటులో ప్రయాణిస్తూ గోదావరి నదీ జలాల మధ్య నుంచి చుట్టుపక్కల ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

బోటును తీరానికి సుమారు 100 మీటర్ల దూరం వరకు తీసుకెళ్లి అక్కడ లంగరు వేస్తారు.

ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గంట, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మరో గంట పాటు నదీవిహారం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

బోటులో బస చేసే పర్యాటకులకు ఉదయం అల్పాహారం ఉచితంగా అందిస్తారు.

భోజనం, ఇతర ఆహార పదార్థాలు కావాలంటే ముందుగా ఆర్డర్‌ చేయవచ్చు. అక్కడి సిబ్బంది వాటిని సమకూర్చనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పది రోజుల్లో హౌస్‌బోటు సేవలు

24 గంటల హౌస్‌బోటు బసకు సాధారణ రోజుల్లో సుమారు రూ.7,500, వారాంతాల్లో రూ.10 వేల వరకు వసూలు చేసే అవకాశం ఉంది.

అయితే తుది ధరలను అధికారులు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

బోటు నిర్వహణకు సంబంధించి పర్యాటక శాఖ నుంచి అవసరమైన అనుమతుల కోసం నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు.

ఈ ప్రక్రియ వారం నుంచి పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తూర్పుగోదావరి జిల్లా పర్యాటకశాఖ అధికారి వెంకటాచలం తెలిపారు.

దీంతో మరో పది రోజుల్లో హౌస్‌బోటు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

నది మధ్యలో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్

గోదావరి పర్యాటకంలో మరో ప్రత్యేక ఆకర్షణగా 'ఫ్లోట్‌ ఇన్‌ డైన్‌' కూడా అందుబాటులోకి వచ్చింది.

నిశీధి సమయంలో నది మధ్యలో క్యాండిల్‌ లైట్‌ వెలుతురులో కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి వేడుకలు చేసుకునేలా దీనిని రూపొందించారు.

నాలుగు వైపులా ఓపెన్‌గా ఉండే ఈ ఫ్లోటింగ్‌ డైన్‌ నిర్మాణంపై సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేశారు.

వివరాలు 

రాత్రి 7 నుంచి 11 గంటల వరకు

'ఫ్లోట్‌ ఇన్‌ డైన్‌'ను నది ఒడ్డుకు సుమారు 300 మీటర్ల దూరంలో లంగరు వేసి ఉంచుతారు. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇది పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది.

గంటకు ఒక స్లాట్‌ చొప్పున కేటాయించారు. ఇక్కడ భోజనం, ఇతర వస్తువులను నిర్వాహకులు అందించరు.

పర్యాటకులు తమకు కావాల్సిన ఆహారం, ఇతర వస్తువులను ముందుగానే బుక్‌ చేసుకుని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

వివరాలు 

స్పీడ్‌బోటులో ఫ్లోట్‌ ఇన్‌ డైన్‌కు

పర్యాటకులను నది ఒడ్డునుంచి స్పీడ్‌బోటులో 'ఫ్లోట్‌ ఇన్‌ డైన్‌' వద్దకు నిర్వాహకులు తీసుకెళ్తారు.

సాధారణ రోజుల్లో గంటకు సుమారు రూ.2,500, వారాంతాల్లో రూ.4 వేల వరకు ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది.

దీంతో గోదావరి మధ్యలో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌తో పాటు కొత్త తరహా నదీ విహార అనుభూతిని పొందేందుకు పర్యాటకులకు అవకాశం కలగనుంది.

ADVERTISEMENT