Kovvada Nuclear Plant: కొవ్వాడ అణు ప్రాజెక్టుకు 2,079 ఎకరాల భూమి సేకరణ పూర్తి.. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఈ వార్తాకథనం ఏంటి
కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కోసం 2,079 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ పూర్తయిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆర్ఆర్ (పునరావాస) కాలనీ నిర్మాణానికి 197 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. కాలనీకి రహదారి ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని కూడా సేకరిస్తున్నామని, అనుసంధాన రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. శాసనసభలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ప్రాజెక్టు అని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోనున్న కొవ్వాడ ప్రాంత మత్స్యకారులు కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఈశ్వరరావు సభ దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో..
గత పదేళ్లుగా వారికి ఆర్ఆర్ కాలనీ నిర్మించకపోవడంతో సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
గ్రామాన్ని తరలించాల్సి ఉందనే కారణంతో పంచాయతీ పరిధిలో కనీస మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో తమ జీవన పరిస్థితులు మెరుగుపడతాయని స్థానికులు ఆశిస్తున్నారని చెప్పారు.
ప్రాజెక్టు కోసం ఇళ్లు, జీవనాధారాన్ని కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈశ్వరరావు కోరారు.